సుప్రీం ఆదేశాలు పాటించాలి: ఆ భూమిపై నిర్ణయం మాదే: సున్నీ వక్ఫ్ బోర్డ్
లక్నో: అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సమీక్ష పిటిసన్కు కూడా వెళ్లే ఆలోచన లేదని కూడా తెలిపింది. తాజాగా, కీలక వ్యాఖ్యలు చేసింది.
15రోజుల్లో నిర్ణయం..
అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పిన ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ తెలిపింది. నవంబర్ 26న ఈ మేరకు సమావేశం నిర్వహించి తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. వివాదాస్పద స్థలాన్ని రామాలయం నిర్మాణానికి కేటాయించి.. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని కేంద్రాన్ని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శనివారం ఆదేశించిన విషయం తెలిసిందే.
భూమి తీసుకోవద్దని..
ఈ క్రమంలో భూమి తీసుకునే విషయంలో తమకు భిన్నాభిప్రాయాలున్నాయని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జుఫర్ ఫరూఖీ అన్నారు. నవంబర్ 26న జరగబోయే జనరల్ బాడీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొందరు మసీదు నిర్మాణానికి భూమి తీసుకోవద్దని ప్రతిపాదిస్తున్నారని, ఇది ఒక విధంగా ప్రతికూల వాతావరణానికి కారణమవుతుందని అన్నారు.
సుప్రీం ఆదేశాలను పాటించాలి.. నిర్ణయం మాత్రం మాదే..
అదే సమయంలో ఆ భూమిని తీసుకుని మసీదుతోపాటు విద్యాలయం ఏర్పాటు చేయాలని మరికొందరు సూచిస్తున్నారని ఆయన తెలిపారు. భూ కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించాలని అన్నారు. అయితే, భూమి తీసుకోవాలా? వద్దా? అనే విషయాన్ని మాత్రం తాము తీసుకుంటామని తెలిపారు.
సుప్రీంతీర్పు సమ్మతమే.. రివ్యూకు వెళ్లేది లేదు..
అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జుఫర్ ఫరూఖీ స్పష్టం చేశారు. రివ్యూ పిటిషన్ వేసే యోచన కూడా తమకు లేదని ఆయన తేల్చి చెప్పారు. కాగా, సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలురిస్తూ.. అయోధ్యలో వివాదాస్పద భూమిని రామమందిర నిర్మాణానికి, అయోధ్యలోనే వేరే ప్రాంతంలో మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది.