బద్రినాథ్లో విరిగిన కొండచరియలు: చిక్కుకున్న 3వేలమంది భక్తులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడుతుండటంతో వేలాదిమంది భక్తులు మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. ఉత్తరాఖండ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ - విష్ణుప్రయాగ సమీపంలో మంగళవారం, బుధవారం నాడు ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి.
దారి మూసుకుపోయింది. దీంతో ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న మూడువేల మందికి పైగా భక్తులు చిక్కుకుపోయారి. వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో మరిన్ని కొండచరియలు విరిగిపడే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ కారణంగా గోవింద్ ఘాట్, జోషిమఠ్, పందకేశ్వర్, బద్రీనాథ్లకు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. మంగళవారం నాడు వర్షం కురియడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయని జోషిమఠ్ సీనియర్ అధికారులు చెప్పారు.
ఎడతెగని వర్షాల వల్ల ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించలేదు. హైవే రోడ్డు మార్గాన్ని బాగు చేసేందుకు అధికారులు మంగళవారం రాత్రంతా కృషి చేశారు.
వర్షాలు వస్తాయని ముందుగా ఎలాంటి హెచ్చరికలు లేవని, హఠాత్తుగా ఈ వర్షాలు కురిశాయని చెబుతున్నారని తెలుస్తోంది. హైవేను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. చార్ధామ్ యాత్ర (బద్రీనాథ్, కేదర్ నాథ్, యమునోత్రి, గంగోత్రి)కు ప్రతి ఏడాది పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తారు.