సమస్యకు ముగింపు: జమ్మూకాశ్మీర్లో తొలి నగదు రహిత గ్రామం ఇదే
సమస్యకు ముగింపు: జమ్మూకాశ్మీర్లో తొలి నగదు రహిత గ్రామం ఇదే
శ్రీనగర్: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు నగదు కోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఒక గ్రామం మాత్రం నగదు రహిత లావాదేవీలతో ఆ ఇబ్బందులను అధిగమించేసింది. దీంతో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనే తొలి నగదు రహిత గ్రామంగా లేనూరా నిలిచింది.
ఈ విషయాన్ని రాస్ట్ర అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. లేనూరా గ్రామం రాష్ట్ర వేసవి రాజధాని శ్రీనగర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామంలోని ప్రతీ కుటుంబంలోని ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్(ఈపీఎస్) గురించిన అవగాహన ఉందని సదరు అధికారి తెలిపారు.
జిల్లాలోని ఖాన్ సాబ్ బి బ్లాక్ లోని బుగ్రూ పంచాయతీలో 150మందికి ఈపీఎస్ పై అవగాహన కల్పించడం జరిగింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ నగదు రహిత ప్రోత్సహించాలని చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. ప్రజలు కూడా నగదు రహిత లావాదేవీలను అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు.
ఇక దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్కు 125 కిలోమీటర్ల దూరంలోని ఇబ్రహీంపూర్ తొలి నగదు రహిత గ్రామంగా నిలిచింది. గ్రామంలో చిన్నాపెద్దలు కలిపి 1200మంది నివసిస్తుండగా, 370 కుటుంబాలకు డెబిట్ కార్డులను అందజేయడం జరిగింది.