లార్సన్ & ట్యూబ్రోకే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు..ఎంతకు బిడ్ దాఖలు చేసిందంటే..!
ముంబై: దేశవ్యాప్తంగా బుల్లెట్ రైలుపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేరా ఒక హైస్పీడ్ రైలును నడపాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం పలు బహుళజాతి నిర్మాణ సంస్థలను టెండర్లకు ఆహ్వానించింది. పలు సంస్థలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. అయితే చివరకు అతితక్కువగా బిడ్ చేసిన లార్సెన్ ట్యూబ్రోకు ఈ మెగా ప్రాజెక్టు పనులు దక్కాయి.
ముంబై-అహ్మదాబాదుల మధ్య హైస్పీడ్ రైలు ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. మొత్తంగా 508 కిలోమీటర్లు ఉండగా ఇందులో మెజార్టీ భాగం అంటే 237 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. దీంతో ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ లార్సెన్ అండ్ ట్యూబ్రో రూ. 24,985 కోట్లుకు బిడ్ వేసి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును దక్కించుకుంది. ఇక ఈ టెండర్లు వేసిన సంస్థల్లో టాటా ప్రాజెక్ట్స్, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలు కూడా ఉన్నాయి. అయితే టెండర్ల రేసులో ఈ సంస్థలను వెనక్కు నెట్టి తక్కువ బిడ్డింగ్తో లార్సెన్ ట్యూబ్రో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును దక్కించుకుంది.
జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో రూ.1.08 లక్షల కోట్లతో ముంబై - అహ్మదాబాదుల మధ్య బుల్లెట్ ట్రైన్ మెగా ప్రాజెక్టు నిర్మాణంకు పునాదులు పడ్డాయి. గత నెల సెప్టెంబర్ 23న టెక్నికల్ ప్రాజెక్ట్స్ కోసం బిడ్డింగ్ ఓపెన్ అయ్యింది. కేవలం నెలరోజుల వ్యవధిలోనే బిడ్డింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ప్రస్తుతం లార్సన్ ట్యూబ్రో 47శాతం పనులను దక్కించుకుంది. మహారాష్ట్రలో ఉన్న వాపిలోని జరోలి గ్రామం గుజరాత్ సరిహద్దులో ఉంది. ఇక్కడి నుంచి గుజరాత్ రాష్ట్రంలోని వడోదర వరకు పనులను లార్సెన్ ట్యూబ్రో సంస్థ బిడ్డింగ్ ద్వారా దక్కించుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య వాపి, బిల్లిమోరా, సూరత్, మరియు బరూచ్ స్టేషన్లు ఉంటాయి.
వాస్తవానికి గతేడాది మార్చి 15న ముంబై - అహ్మదాబాదుల మధ్య హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ బిడ్లను ఆహ్వానించింది. ఈ మొత్తం ప్రాజెక్టుకు అయ్యే ఫైనాన్స్ జపాన్ ఇంటర్నేషన్ కోఆపరేషన్ ఏజెన్సీ అందించేందుకు ముందుకొచ్చింది. అయితే సాంకేతికపరమైన బిడ్లకు మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 23న ఆహ్వానించడం జరిగింది. ఇక బిడ్డింగ్ దక్కించుకున్న ఎల్ & టీ సంస్థ సివిల్ వర్క్స్, భవనాల నిర్మాణం, హైస్పీడ్ రైల్కు డబుల్ లైన్ డిజైన్ మరియు నిర్మాణం, బ్రిడ్జీలు, డిపో మెయిన్టెనెన్స్, టనెల్స్, స్టేషన్ల నిర్వహణ బాధ్యతలు చేసుకుంటుంది.