లష్కరే తొయిబా నడ్డి విరిచిన ఆర్మీ: ఎన్కౌంటర్లో టాప్ కమాండర్ హతం: పాక్ నుంచి వచ్చి మకాం..!
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో తరచూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతోన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా నడ్డి విరిగింది. ఈ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ను మనదేశ ఆర్మీ జవాన్లు మట్టుబెట్టారు. ఆదివారం ఉదయం జమ్మూ కాశ్మీర్లోని హంద్వారా జిల్లాలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ సందర్భంగా లష్కరే టాప్ కమాండర్ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. కాశ్మీర్లోయలో పెద్ద ఎత్తున దాడులకు కుట్ర పన్నినట్లు తేలిందని అన్నారు.
హంద్వారా జిల్లాలో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఎన్కౌంటర్ సందర్భంగా లష్కరే తొయిబా కమాండర్ హైదర్ను కాల్చిచంపినట్లు కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. మృతుడిని హైదర్గా గుర్తించామని అతను స్థానికుడు కాదని నిర్ధారించినట్లు తెలిపారు. పొరుగునే ఉన్న పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు తేలిందని చెప్పారు. సరిహద్దుల్లో భద్రతా బలగాల కన్నుగప్పి భారత భూభాగంపైకి అడుగు పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
కుప్వారా జిల్లాలోని హంద్వారా వద్ద ఈ ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకరంగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 21 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అశుతోష్ శర్మ వీరమరణం పొందారు. ఆయనతో పాటు ఇద్దరు జవాన్లు, జమ్మూ కాశ్మీర్ పోలీసు శాఖకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ అమరులయ్యారు. హంద్వారాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉమ్మడిగా ఎన్కౌంటర్ను నిర్వహించాయి.
సుమారు మూడు గంటల పాటు ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. ఎన్కౌంటర్ ముగిసిన అనంతరం ఆర్మీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు స్పష్టమైంది. వారిలో ఒకరు హైదర్ ఉన్నాడని నిర్ధారించారు. సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని డాక్యుమెంట్లు, మరణాయుధాలను పరిశీలించగా.. హైదర్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు తేలిందని ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. దీనిపై మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు.