యూరి: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్, 177 మంది భారత జవాన్లను చంపినట్లు పోస్టర్
చండీగఢ్: యూరి ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని చెబుతున్న పాకిస్తాన్ మరోసారి అడ్డంగా బుక్కయింది! పాక్ ఉగ్రవాదులు కాశ్మీర్లో చొరబడి సెప్టెంబర్ 18న యూరి సైనిక శిబిరంపై జరిపిన దాడిలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ను ఏకాకిని చేసింది. సర్జికల్ స్ట్రయిక్స్ దాడుల ద్వారా తగిన బుద్ధి చెప్పింది. ఇదిలా ఉండగా, పాక్ను అడ్డాగా చేసుకుని ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా సంస్థ తాజాగా యూరి దాడికి పాల్పడింది తామేనని ప్రకటించింది.
పాకిస్తాన్ పంజాబ్లోని గుజ్రాన్వాలాలో వెలసిన పోస్టర్లే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. యూరి దాడిలో హతమైన లష్కరే ఉగ్రవాది ముహమ్మద్ అనాస్ అలియాస్ అబూ సరఖా అంతక్రియల సందర్భంగా జరిగే ప్రార్థనలకు జమాత్ ఉద్ దువా చీఫ్ హఫీజ్ సయీద్ హాజరవనున్నట్లు ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
ఉర్దూలో రాసి ఉన్న ఈ పోస్టర్లో లష్కరే తొయిబా జరిపిన దాడిలో 177 మంది భారత సైనికులను హతం చేసినట్టు చెప్పుకున్నారు. ఈ దాడిలో అమరుడైన అనాస్ మృతదేహం లేకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు ఉంది. గుజ్రాన్వాలా పట్టణంలోని సదబహర్ నర్సరీ వద్ద అంత్యక్రియలు జరపనున్నట్టు తెలిపారు.