లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పెద్ద ప్లానే వేశాడు !
న్యూఢిల్లీ: భారతదేశం మీద పగ తీర్చుకోవడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్న లష్కరే-ఏ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ మన దేశంలో చొరబడటానికి సరి కొత్త ప్లాన్ వేస్తున్నాడని వెలుగు చూసింది.
నదీ మర్గాల్లో భారత్ లోకి చొరబడటానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. భారత సైన్యం 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా మన సరిహద్దులను కాపాడుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు భారత్ మీద దాడి చెయ్యడం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
నిత్యం దొంగదారుల్లో కుక్కల్లాగా చొరబాట్లకు అలవాటైన ఉగ్రవాదులు నదీ మార్గం ద్వారా భారతదేశంలో ప్రవేశించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారని వెలుగు చూసింది. అందుకు అనువుగా తవి నది, నిక్కి తవి నదులు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.
భారత్ లో ఉగ్ర దాడులు చెయ్యడానికి లష్కర్ కమాండర్ అబు ఇర్ఫాన్ తండేవాలాను ఆపరేషన్ ఇన్ఛార్జిగా హఫీజ్ సయీద్ నియమించాడని తెలిసింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ ను కోలుకోలేకుండా దెబ్బతీయ్యాలని ప్లాన్ వేస్తున్నారు.
కసితో రగిలిపోతున్న హఫీజ్ సయీద్ రహస్యంగా సరికొత్త ప్లాన్ తో ఈ ప్రణాళికలు రచిస్తున్నాడని వెలుగు చూసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ కోసం సుమారు 8 మంది నుంచి 9 మందిని నియమించారని తెలిసింది.
లష్కరే-ఏ-తొయిబా ఉగ్రవాదులకు పాక్ సైన్యం సంపూర్ణంగా సహకరిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని నదులు, ప్రవాహాల వెంబడి ఇప్పటికే నిఘాను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని అనుమానం రావడంతో ఆ ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టారు.
ఎలాగైనా భారత్ లో చొరబడటానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకుని వారికి గట్టి గుణపాఠం చెప్పడానికి బీఎస్ఎఫ్ అధికారులు, సైన్యం సిద్దం అయ్యారు. హఫీజ్ సయీద్ ఆటలు పాక్ లో చెల్లుతాయని, ఇక్కడ అతని అనుచురులు ఏమీ చెయ్యలేరని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు.