బీజేపీకి నిద్రలేని రాత్రులు ఏంటో చూపిస్తాం: లష్కరే తోయిబా
కశ్మీర్లో హత్యకు గురైన ప్రముఖ పత్రికా ఎడిటర్ షుజాత్ బుఖారీ కేసులో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా స్పందించింది. షుజాత్ హత్యతో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా గజ్నవి తెలిపారు.
లష్కరే తొయిబానే ఈ హత్య చేసిందని భారతీయ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్నారు. షుజాత్ హత్య లష్కరే తోయిబా చేసిందని చెప్పడం పచ్చి అబద్ధమని గజ్నవి చెప్పారు.
కశ్మీర్లో లష్కరేతోయిబా సంస్తకు చెందిన వారిని బీజేపీ నేత లాల్ సింగ్ లక్ష్యం చేసుకోవడంపై మండిపడ్డ గజ్నవి బీజేపీకి నిద్రలేని రాత్రులు చూపిస్తామని హెచ్చరించాడు. ప్రస్తుతం కాశ్మీర్లో చోటుచేసుకున్న పరిణామాలతో భారత ప్రభుత్వం నిరాశలోకి కూరుకుపోయిందని అందుకే ఆర్మీ బలగాలతో పాటు అక్కడ ఎన్ఎస్జీ కమాండోలను సైతం దింపిందని ఆరోపించారు.
కాశ్మీర్ను ఆక్రమించుకోవడం కోసం గత 70 ఏళ్లుగా భారత్ చేస్తున్న కుటిల ప్రయత్నాలు విఫలమవుతున్నాయని ధ్వజమెత్తిన గజ్నవి... భవిష్యత్తులో కూడా కాశ్మీర్ భారత్ వశం కాదని జోస్యం చెప్పాడు.