కాశ్మీర్ ర్యాలీలో లష్కర్ టెర్రరిస్ట్ కలకలం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో మరో కలకలం చెలరేగింది. లష్కర్- ఏ- తోయిబా ముఖ్య నాయకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబూ దుజాన్ బహిరంగ ప్రదేశంలో ముసుగు వేసుకుని కనిపించాడని భారత్ నిఘా వర్గాలు పసిగట్టాయి.
ఆందోళనలతో కాశ్మీర్ లోని పలు జిల్లాలు అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఆదివారం పుల్వామా జిల్లాలో ఓ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో కాశ్మీరీ యువకులతో కలిసి అబూ దుజాన్ ముసుగు వేసుకుని నడుస్తూ వెళ్లాడని భారత్ నిఘా వర్గాలు నిర్దారించాయి.
ఇటీవల కాశ్మీర్ లో జరిగిన కాల్పుల్లో హిజబుల్ ఉగ్రవాది బుర్హాన్ వని అంతం అయ్యాడు. బుర్హాన్ అంత్యక్రియలకు అబూ దుజాన్ హాజరైనాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా బహిరంగ ర్యాలీలో అతను ప్రత్యక్షం అయ్యాడని వీడియోలు బయటకు వచ్చాయి.
అబూ దుజాన్ ప్రత్యక్షం కావడంతో కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లష్కర్ -ఏ -తోయిబా ఉగ్రవాద సంస్థకు కాశ్మీర్ చీఫ్ గా వ్యవహరిస్తున్న అబూ దుజాన్ గత కొన్నేళ్లుగా అజ్క్షాతంలో ఉంటున్నాడు.
అయితే అతను బహిరంగ ర్యాలీలో ప్రత్యక్షం కావడంతో పెద్ద కుట్రదాగి ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. బుర్హాన్ ఎన్ కౌంటర్ తరువాత కాశ్మీర్ లో చెలరేగిన అల్లర్లను తమకు అనుకూలంగా తిప్పుకునేందుకు పాకిస్థాన్ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నది.
కాశ్మీర్ లోని యువతను రెచ్చగొట్టిన పాక్ ఆందోళనలు చేయిస్తున్నది. అందుకే అబూ దుజాన్ ను రంగంలోకి దింపి కాశ్మీరీ యువతతో నేరుగా మాట్లాడించి ఉగ్రవాదాన్ని మరింత విస్తరించాలని ప్రయత్నిస్తున్నది.
హిజబుల్ ఉగ్రవాది బుర్హాన్ అంత్యక్రియలు లష్కర్- ఏ- తోయిబాకు చెందిన అమీర్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో జరగడం గమనార్హం. ఇప్పుడు కాశ్మీర్ లో జరుగుతున్న ర్యాలీలు, నిరసన కార్యక్రమాల మీద పోలీసులు, సాయుధ బలగాలు గట్టి నిఘా వేశారు.
రాజ్ నాథ్ పర్యటన రద్దు చెయ్యండి......... ఉగ్రవాద నాయకులు
కాశ్మీర్ అంశంపై పాక్ ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి పెంచే విధంగా జమాత్ ఉల్ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయిద్, హిజబుల్ ముజాహిద్దీన్ నాయకుడు సయిద్ సలాహుద్దీన్ పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఇస్లామాబాద్ లోని భారత్ హై కమీషన్ కార్యాలయం ముట్టడించారు. ఆదివారం జరిగిన ర్యాలీలో వీరిద్దరూ ప్రసంగించారు. భారత్ హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను పాక్ లో అడుగు పెట్టనివ్వరాదని పాక్ ప్రభుత్వానికి మనవి చేశారు.
సైనిక బలగాలతో కాశ్మీర్ లోని అమాయక ప్రజలను చంపేస్తున్న భారత్ కు గట్టి బుద్ది చెబుతామని హెచ్చరించారు. రాజ్ నాథ్ సింగ్ సార్క్ సమావేశాల్లో పాల్గోని తిరిగి వెళ్లిపోతారని, పాక్-భారత్ ల మధ్య ఎలాంటి దైపాక్షిక చర్చలు జరగవని పాక్ ప్రభుత్వం ఇస్లామాబాద్ లో ఒక ప్రకటన విడుదల చేసింది.