బీ అలర్ట్: ఇక మిగిలింది అయిదు పని దినాలే: అయోధ్య భూ వివాదంపై ఏ రోజైనా తీర్పు..!
న్యూఢిల్లీ: ఇక మిగిలింది అయిదు పని దినాలు మాత్రమే. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏ రోజైనా తీర్పు వెలువడించడానికి అవకాశం ఉంది. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా అయోధ్య భూ వివాదం సహా రాఫెల్ యుద్ధ విమానల కొనుగోలు, శబరిమలలో వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి చారిత్రాత్మక కేసులపై తీర్పులు రాబోతున్నాయి.
జాగ్రత్త ..అయోధ్య తీర్పుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో ఫినిష్..!
సోమవారం నుంచి వరుసగా దీనికి ఆయా కేసులపై తీర్పులు వెలువడటానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్ ఏ బొబ్డే ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోసం బొబ్డె పేరును ఖరారు చేస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొద్దిరోజుల కిందటే గెజిట్ కూడా జారీ చేశారు. దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్ లో ఎస్ ఏ బొబ్డే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే- విచారణలో ఉన్న కొన్ని కీలకమైన కేసులకు సంబంధించిన వాదోపవాదాలను వాయిదా వేశారు. వాటికి సంబంధించిన ఫైళ్లన్నింటినీ బొబ్డె కార్యాలయానికి అప్పగించారు.
అయోధ్య భూ వివాదంపై రంజన్ గొగొయ్ సహా అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం వాదోపవాదాలను ఆలకించిన విషయం తెలిసిందే. కిందటి నెల 16వ తేదీన ఈ కేసుకు సంబంధించిన వాదలన్నింటినీ ముగించేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం, తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఏ రోజున తీర్పును వెలువరిస్తామనేది అప్పట్లో ధర్మాసనం స్పష్టం చేయలేదు. 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయాల్సి ఉన్నందున.. ఆలోగా తీర్పు వెలువడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు కూడా దీనికి అనుగుణంగా ఉంటున్నాయి.
అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీమసీదుకు చెందిన 2.77 ఎకరాల స్థలాన్ని ఎవరికి కేటాయించాలనే కేసు కోట్లాదిమంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉంది. ఈ కేసుకు ఉన్న సున్నితత్వాన్ని, ప్రాధాన్యతను గుర్తుంచుకుని కేంద్రం ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. అయోధ్య భూ వివాదంపై తీర్పు వెలువడిన తరువాత, దానిపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిషేధించింది. సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది కేంద్ర ప్రభుత్వం. తీర్పు ఎలాంటిదైనా స్వాగతించి తీరాల్సిందేనంటూ హెచ్చరించింది.