సైనిక లాంచనాలతో ప్రణబ్ అంత్యక్రియలు పూర్తి .. కుమారుడు అభిజిత్ ముఖర్జీ చేతుల మీదుగా ..
అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన భారదేశ మాజీ రాష్ట్రపతి , భారత రత్న ప్రణబ్ ముఖర్జీ అంతిమ యాత్ర కోవిడ్ నిబంధనలతో కొనసాగింది . లోధిరోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి . ప్రజలందరికీ సెలవంటూ అందరికీ అభిమాన దాదా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. శోక తప్త హృదయంతో భారత్ ప్రణబ్ ముఖర్జీ కి నివాళులు అర్పించింది .ఢిల్లీ రాజాజీ మార్గంలోని ఆయన నివాసం నుండి లోది రోడ్డులోని స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగింది.
Recommended Video
ప్రత్యేక అంబులెన్స్ లో శ్మశాన వాటికకు ప్రణబ్ పార్థివ దేహం
గన్ క్యారేజ్పై కాకుండా ప్రత్యేక అంబులెన్స్లో శ్మశానవాటికకు ప్రణబ్ పార్థవదేహాన్నితరలించారు . లోధిరోడ్డులోని శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి . ప్రణబ్కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు శోక తప్త హృదయంతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. 84 సంవత్సరాల వయసులో బ్రెయిన్ సర్జరీ కారణంగానూ , కరోనా కారణంగానూ ఆయన ఆరోగ్యం క్షీణించటంతో సోమవారం ప్రణబ్ ముఖర్జీ తుది శ్వాస విడిచారు .
అంతిమ కర్మలను నిర్వహించిన ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ
భారత త్రివర్ణ పతాకాన్ని ఉంచి ఆయనకు గౌరవ లాంచనాలతో తుది వీడ్కోలు పలికారు . ఆయన అంతిమ కర్మలను ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ నిర్వహించారు . కరోనా కారణంగా అందరూ పీపీఈ కిట్లు ధరించి ఆయన అంతిమ యాత్ర నిర్వహించారు. అంతకుముందు ప్రణబ్ నివాసంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజల అధిపతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు , లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాహుల్ గాంధీ ,గులాం నబీ ఆజాద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు .
శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారం
కరోనా ప్రోటోకాల్ ప్రకారం పరిమిత సంఖ్యలో జనాభాను అనుమతించారు. ఆశ్రునయనాల మధ్య ఆయనకు వీడ్కోలు పలికారు. శాస్త్రోక్తంగా అంతిమ సంస్కార క్రతువును నిర్వహించారు. భరతమాత ముద్దుబిడ్డ గా ప్రణబ్ చరిత్రపుటల్లో నిలిచిపోతారని పలువురు ఆయన సేవలను కొనియాడారు. అందరికీ ఆప్తుడిగా ఉన్న దాదా ఆల్విదా అంటూ తిరిగి రాని లోకాలకు చేరిపోయారు. ఆయన భారత రాష్ట్రపతిగా అందించిన సేవలను , ఆయన వ్యక్తిత్వాన్ని పలువురు ప్రస్తుతించారు .
సెప్టిక్ షాక్తో అస్తమించిన ప్రణబ్ ... ఓ శకం ముగిసిందన్న ప్రముఖులు
మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రణబ్కు.. కరోనా వైరస్ కూడా సోకడంతో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్సనందించారు. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. తర్వాత ఆయన మూత్రపిండాల పనితీరు మందగించింది. క్రమంగా సెప్టిక్ షాక్తో బాధపడ్డారని సోమవారం (ఆగస్టు 31న) కార్డియాక్ అరెస్టుతో మరణించారని వైద్యులు తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం నేపథ్యంలో కేంద్రం ఏడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది. ఆయన అస్తమయంతో ఓ శకం ముగుసిందని పలువురు పేర్కొన్నారు .