లతా మంగేష్కర్ నివాస భవనం సీల్: బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా: అందరూ వృద్ధులే
ముంబై: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ నివాస భవన సముదాయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. బయటి వ్యక్తులు రాకపోకలు సాగించకుండా ఉండటానికి ఈ చర్యను తీసుకున్నారు. ముంబైలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యగా బీఎంసీ అధికారులు ఈ భవనాన్ని సీల్ చేశారు. లతా మంగేష్కర్ నివాస భవన సముదాయం ప్రభుకుంజ్.. ముంబై దక్షిణ ప్రాంతంలోని పెద్దర్ రోడ్లో గల ఛాంబల్లా హిల్లో ఉంటుంది.
లతా మంగేష్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ భవనంలో నివసిస్తున్నారు. ఆమె వయస్సు 90 సంవత్సరాలు. కుటుంబ సభ్యులందరూ వయస్సు మళ్లిన వారే కావడం వల్ల ముందుజాగ్రత్త చర్యగా ఈ భవనాన్ని సీల్ చేశారు. ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతుండటం, వృద్ధులకు త్వరగా సోకుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో అధికారులు స్థానిక మున్సిపల్ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
లతా మంగేష్కర్, ఆమె కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని, వారికి వైరస్ సోకలేదని అధికారులు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మాత్రమే తాము ఈ భవనాన్ని సీల్ చేసినట్లు తెలిపారు. దక్షిణ ముంబై ప్రాంతంలో ఇప్పటికే వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. లతా మంగేష్కర్ భవన సముదాయం ఉన్న పెద్దర్ రోడ్లోనూ పలువురికి కరోనా వైరస్ సోకింది. కరోనా మరణాలు కూడా భారీగానే నమోదు అయ్యాయి.
తాము ఆరోగ్యంగా ఉన్నామని లతా మంగేష్కర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాము వైరస్ బారిన పడలేదని స్పష్టం చేశారు. తాము నివసిస్తోన్న భవనాన్ని సీల్ వేయడం వల్ల ఏమైందోననే ఆందోళనతో సన్నిహితులు ఫోన్ చేస్తున్నారని అన్నారు. తమ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఙప్తి చేశారు. తామంతా సురక్షితంగా ఉన్నామని తెలిపారు. ముందుజాగ్రత్త కోసమే బీఎంసీ అధికారులు తమ భవనాన్ని సీల్ చేసినట్లు చెప్పారు.
Recommended Video
ఇదివరకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నివాసాన్ని కూడా అధికారులు సీల్ చేసిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యుల్లో భార్య జయాబచ్చన్ తప్ప మిగిలిన వారందరూ కరోనా బారిన పడ్డారు. కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడ్డవారే. ఆ నలుగురూ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. అప్పట్లో అమితాబ్ భవనాన్ని కొన్ని రోజుల పాటు అధికారులు సీల్ చేశారు.