ఏపీ, తమిళనాడులో కరోనా ప్రత్యేక పరిస్ధితులు- ఒకే వయసు పిల్లల్లో వైరస్ వ్యాప్తి....
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. దక్షిణాదిన ఉన్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పరిస్దితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్ధితి కొనసాగితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గినట్లే అంచనా వేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి సేకరించిన తాజా సమాచారం ప్రకారం ఒకే వయసు పిల్లల్లో కరోనా వ్యాప్తి జరుగుతోందని తేలింది. గతంలో పిల్లలకు వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ సోకే అవకాశాలు తక్కువని కొన్ని అధ్యయనాలు తేల్చగా.. ఇప్పుడు ఒకే వయసు పిల్లల్లో కరోనా సోకే ప్రమాదం ఈ రెండ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని తేలడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.
కరోనాపై సమగ్ర సర్వే..
కరోనా వైరస్ ప్రభావం మొదలైన దగ్గరి నుంచి ఆగస్టు 1 వరకూ కేంద్ర ప్రభుత్వం అంటువ్యాధుల సంక్రమణపై ఓ అధ్యయనం నిర్వహించింది. "ఎపిడెమియాలజీ అండ్ ట్రాన్సిషన్ డైనమిక్స్" పేరుతో సాగిన ఈ అధ్యయనాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఢిల్లీలోని ఎకనామిక్స్ అండ్ పాలసీ, న్యూజెర్సీలోని ప్రిన్సస్ విశ్వవిద్యాలయం, జాన్ హాప్కిన్స్ బ్లూమ్బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంయుక్తంగా నిర్వహించాయి. అధిక కేసులు నమోదవుతూ, బలమైన ప్రజారోగ్య వ్యవస్ద, సమర్ధవంతమైన కేసుల గుర్తింపు విధానం అమలవుతున్న రాష్ట్ర్రాలను ఈ సర్వేకు ఎంపిక చేశారు. ఈ అధ్యయనంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల విషయంలో పలు ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి.
ఏపీ, తమిళనాడు పిల్లల్లో కరోనా వ్యాప్తి
ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో ఒకే వయసు కలిగిన వ్యక్తులతో పాటు చిన్న పిల్లల్లోనూ వైరస్ సంక్రమణ అవకాశాలు ఎక్కువగా ఉందని తేలింది. భారీగా కేసులు నమోదవుతున్న దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్న ఏపీ, తమిళనాడులో తాజా పరిస్ధితులను ఈ అధ్యయనం పరిశీలించింది. ముఖ్యంగా పిల్లల్లో వైరస్ వ్యాప్తి ఎలా ఉందనే అంశాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇందులో ఒకే వయసు పిల్లల్లో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం స్కూళ్లు తెరిచి ఉంచకపోవడం వల్ల ఈ ప్రభావం కాస్త తక్కువగా కనిపిస్తున్నా ఓసారి విద్యాసంవత్సరం మొదలైతే ఇది పెను ప్రభావం చూపుతుందని తెలిపింది.
దగ్గరగా ఉండే పిల్లల్లో వైరస్ వ్యాప్తి...
0 నుంచి 14 ఏళ్ల వయసు మధ్య ఉన్న పిల్లల్లో కరోనా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే 65 ఏళ్లు పైబడిన వృద్ధుల్లోనూ వైరస్ వ్యాప్తి ఎక్కువేనని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇందులో ఒకే వయసు ఉన్న వారికి ఎక్కువ రిస్క్ ఉంటుందని ప్రధానంగా పిల్లల విషయంలో చెప్పింది. పిల్లలు ఒకే చోటు గుమి కూడి ఉండటం, ఒకే ఇళ్లలో నివసించడం, ఒకే చోట చదువుకోవడం వంటి అంశాలు ఇందుకు కారణమవుతాయని తెలిపింది. ప్రస్తుతం స్కూళ్లూ మూసి ఉన్నప్పటికీ ఇళ్ల వద్ద, సామాజిక పరిస్ధితుల్లో వీరు రిస్క్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో స్కూళ్లు తెరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలకు ఎంతో ఉపయోగపడనున్నాయి.