కరోనా ఎఫెక్ట్: ప్రతి 1000లో ఒకరికి వైరస్.. 32 వేల మంది మృతి.. ఇండియాలో 1000 దాటిన కేసులు..
కరోనా మహమ్మారి ధాటికి పశ్చిమదేశాలను జనం పిట్టల్లా రాలిపోతుండగా.. ఇండియాలో కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 100కుపైగా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు, పలు సంస్థల రిపోర్టుల ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలవరకు మన దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. మరణాల సంఖ్య 27గా ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 196 మందికి వైరస్ సోకగా, 182 కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో ఇప్పటిదాకా 67 కేసులు వెలుగుచూడగా, ఏపీలో మాత్రం 19 కేసులు నమోదయ్యాయి.
లాక్ డౌన్ ఐదో రోజైన ఆదివారం నాటికి కేసుల సంఖ్య పెరగడం, ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగా నమోదు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని రెడ్ జోన్లు గా గుర్తించి, పటిష్టచర్యలు చేపట్టాయి. వైరస్ వ్యాప్తి చెందరాదనే ఉద్దేశంతో లాక్ డౌన్ ప్రకటించినా.. ఢిల్లీ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వలసకూలీలు తమ సొంత ఊళ్లకు వెళుతుండటం ఇబ్బందికర పరిణామంగా మారింది. కూలీలు వెళుతోన్న ఊళ్లను గుర్తించి, వెంటనే వారికి పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని కేంద్రం.. ఆయా రాష్ట్రాలకు సూచించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలకు చేరువైంది. అంటే, ప్రపంచ జనాభాలో పోల్చుకుంటే, సుమారు ప్రతి వెయ్యి మందిలో ఒకరికి వైరస్ సోకినట్లుగా భావించాలి. కేసుల తోపాటు కరోనా మరణాలు కూడా కలవరపెట్టేస్థాయికి చేరాయి. ఇప్పటిదాకా చనిపోయినవారి సంఖ్య 32 వేలు దాటింది. అదేసమయంలో కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1.5లక్షలుగా నమోదైంది.