నో న్యూస్: షీనాబోరా హత్య కేసు ఇక ముగిసినట్టేనా?
ముంబై: షీనాబోరా హత్యకేసులో ఏం జరిగిందో తెలుసుకోవాలని యావత్ భారతావని ఎంతో ఆసక్తిని కనబరించింది. ఎందుకంటే ఇండియాలో మీడియా మొఘల్గా అభివర్ణించే పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ముఖార్జియా తన కన్న కూతురినే హత్య చేసింది కాబట్టి. ఓ పదిరోజుల పాటు దేశ వ్యాప్తంగా మీడియాలో షీనాబోరా హత్యే కేసుపై కథనాలు వెల్లువెత్తాయి.
ఈ హత్యకేసులో విచారణ ఎలా కొనసాగుతుందో క్షణక్షణం చెప్పుకొచ్చాయి. అంతేకాదు ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా స్వయంగా నిందితులను విచారించారు. కొన్ని రోజుల పాటు ఈ కేసుపై దృష్టి పెట్టారు. షీనాబోరా హత్యకేసులో ఉన్న చిక్కుముడులను విప్పేందుకు ఎంతగానో శ్రమించారు.
అయితే, ఇంద్రాణి ముఖార్జియా భర్త పీటర్ ముఖార్జియాను విచారణలో భాగంగా లోతుగా ప్రశ్నలు వేసిన మరుసటి రోజే రాకేష్ మారియా 'ప్రమోషన్' పేరుతో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలేమీ బయటకు రావడం లేదు.
ఈ కేసుని ఒక కొలిక్కి తెచ్చిన రాకేష్ మారియా బదిలీతో షీనాబోరా హత్య కేసు దర్యాప్తు నెమ్మదించిందా అంటే అవుననే అంటున్నారు పాత్రికేయ మిత్రులు. గడచిన రెండు మూరు వారాలుగా ఈ కేసును విచారిస్తున్న ఖర్ పోలీసు స్టేషన్ ఎదుట, లైవ్ కెమెరాలతో సిద్ధంగా ఉన్న రిపోర్టర్లు, ఓబీ వాహనాలు, ప్రత్యేక మీడియా పాయింట్ ఇలాంటివేవీ ఇప్పుడక్కడ లేవు.
దీనికంతటికి కారణం ఈ కేసులో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడం ఒక ఎత్తైతే, మూడేళ్ల క్రితం ఈ హత్య జరగడం రెండోది. ఈ కేసులో కీలక ఆధారమైన మృతదేహం లేదు కాబట్టి, కోర్టులో కేసు వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో లైట్ తీసుకున్నారు.
మరోవైపు 'ప్రమోషన్' పేరుతో బదిలీ అయిన రాకేష్ మారియా ఇంద్రాణి కేసును ఆయన పర్యవేక్షించవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, జరిగిన పరిణామాలు రాకేష్ మారియాకు వేదన కలిగించాయి. ఇక ఈ కేసులో తన ప్రమేయం ఉండదని ఆయన తేల్చి చెప్పేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతుందని తాజా కమిషనర్ అహ్మద్ జావేద్ వెల్లడించారు.
ఇక ఈ హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖార్జియా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఎలాగూ బెయిల్ వస్తుంది. ఆపై కొన్నేళ్ల పాటు కేసు సాగుతుంది. చివరకు పోలీసులు సరైన సాక్ష్యాలను ప్రవేశపెట్టలేదంటూ కోర్టు కొట్టేస్తుందేమో?
ఇలా హైప్రొపైల్ కేసులు కోర్టుల్లో సంవత్సరాలు తరబడి విచారణ కొనసాగుతూనే ఉంటాయి. చివరకు హీనాబోరా హత్యకేసు కూడా అదే కోవలోకి చేరుతుందా? లేక షీనా బోరా హత్యకు కారకులైన వారికి సరైన శిక్ష పడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.
ఇప్పటికైతే ఈ కేసును అటు ప్రజలు, మీడియా సైతం మర్చిపోవాల్సిందే. ఎందుకంటే ఈ కేసును తొలి నుంచి ఫాలో అప్ చేసిన అధికారులు ఇప్పుడు గణేష్ ఉత్సవాల భద్రతలో బిజీగా ఉన్నారు.