మోడీకి క్లీన్చిట్పై ఈసీలో అసమ్మతి?
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల విషయంలో ఎలక్షన్ కమిషన్లో బేధాభిప్రాయాలు వ్యక్తమయినట్లు తెలుస్తోంది. మోడీపై అందిన కంప్లైంట్స్లో క్లీన్ చిట్లు ఇవ్వడంపై ఒక కమిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షాకు సైతం నియమావళి ఉల్లంఘనకు పాల్పడలేదన్న నిర్ణయంపై ముగ్గురు సభ్యుల్లో అసమ్మతి వ్యక్తమైనట్లు తెలుస్తోంది.
కేంద్రంలో ఈసారి అధికార పీఠం ఎవరిది?.. అక్కడ ఏ పార్టీ గెలిస్తే వాళ్లదేనా కుర్చీ?
ఆరుసార్లు మోడీకి గ్రీన్ సిగ్నల్
ప్రచారంలో మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘనకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాయి. ఈ కంప్లైంట్స్పై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాతో పాటు కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు మోడీపై వచ్చిన ఫిర్యాదుల్లో ఆరింటిపై విచారణ పూర్తి చేసిన కమిషన్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే గత నెలలో మోడీ చేసిన రెండు ప్రసంగాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో ఒకరు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కారణంగా 2 : 1 మెజార్టీతో మోడీ స్పీచ్లకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లు తెలుస్తోంది.
అశోక్ లావాసా అభ్యంతరం?
ఏప్రిల్ 1న వార్దాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మోడీ వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయడం ఘాటు విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించింది. అదే నెల 9న లాతూర్లో జరిగిన సభలో ప్రధాని పుల్వామా, బాలాకోట్ ఘటనల్ని ప్రస్తావించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రసంగాలపై అందిన ఫిర్యాదులపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ మోడీ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టంచేసింది. అయితే ఈ విషయంలో సీఈసీ, అరోరా, మరో కమిషనర్ సుశీల్ చంద్ర నిర్ణయంతో అశోక్ లావాసా విబేధించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
మెజార్టీ నిర్ణయం చెల్లుబాటు
ఎన్నికల సంఘం చట్టం 1991 ప్రకారం సీఈసీ, ఇతర ఎన్నికల కమిషన్లు ఏదైనా అంశంపై భిన్నభిప్రాయాలు కలిగి ఉంటే మెజార్టీ సభ్యుల నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగాలపై ఈసీ తీసుకున్న నిర్ణయం 2 : 1 మెజార్టీతో ఆమోదం పొందినట్లు తెలుస్తోంది. మొదటిసారి ఓటుహక్కువినియోగించుకోబోయే యువతను ఉద్దేశించి గత నెల ఏప్రిల్ 9వ తేదీన మహారాష్ట్ర లాతూర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ బాలాకోట్ దాడులకు పాల్పడిన వీరులు, పుల్వామాలో అమరులైన జవాన్లకు ఓట్లు అంకితం చేయాలని అన్నారు. ఇక ఏప్రిల్ 1న వార్దాలో వయనాడ్లో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నందునే రాహుల్ గాంధీ అక్కడి నుంచి బరిలో దిగుతున్నారని విమర్శించారు. ఈ రెండు వ్యాఖ్యలపై ఈసీ తాజాగా మోడీకి క్లీన్ ఇచ్చింది.