జమిలి ఎన్నికలు సాధ్యం కాదు: తేల్చిచెప్పిన లాకమిషన్
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలు సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై లా కమిషన్ గురువారం స్పష్టతనిచ్చింది. జమిలి ఆలోచన మంచిదే కానీ, మన రాజ్యాంగానికి లోబడి అది సాధ్యం కాదని చెప్పింది.
దీనిపై లోతుగా చర్చించాలని, రాజ్యాంగ నిపుణుల సమక్షంలో నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడింది. జమిలి ఎన్నికలపై తయారు చేసిన డ్రాఫ్టును గురువారం లాకమిషన్ కేంద్రానికి సమర్పించింది. ఎన్నికల నిర్వహణ, సెక్యూరిటీపరమైన అంశాలకు సంబంధించి ఇది సాధ్యం కాదని చెప్పింది.
లా కమిషన్ ముసాయిదా ప్రకారం జమిలి ఎన్నికల ప్రతిపాదన కేవలం ప్రభుత్వానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇందులో అందరి అభిప్రాయాలు సేకరించాలని, దీనిపై తుది నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభుత్వం అందరికీ సమాధానం చెప్పుకునేదిగా ఉండాలని, జమిలి ఎన్నికల ఆలోచన చాలా మంచిదని, దీని వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని, పరిపాలనా వ్యవస్థ మీద భారం తగ్గుతుందని, కానీ ఒకేసారి ఎన్నికలు జరిపితే భద్రతాపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని, మన రాజ్యాంగ పరిమితులకు లోబడి జమిలి అసాధ్యమి చెప్పింది.