చట్టం రాజులకే రారాజు.. అన్నింటి కంటే అత్యున్నతమైనది : ప్రధాని నరేంద్ర మోదీ
దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రీంకోర్టు కాంప్లెక్స్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ న్యాయ సదస్సు2020ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. చట్టం అన్నింటికంటే అత్యున్నతమైనదని.. అది రాజులకే రారాజు లాంటిదని అభిప్రాయపడ్డారు. డా.బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం కేవలం న్యాయవాద డాక్యుమెంట్ మాత్రమే కాదని.. అది జీవితాన్ని నడిపించే వాహనం అని పేర్కొన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. సత్యం,ప్రజా సేవ కోసం గాంధీ తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. న్యాయ వ్యవస్థకు సాంకేతికత కూడా తోడైందని.. అయితే సైబర్ క్రైమ్,డేటా ప్రొటెక్షన్ వంటి న్యాయ వ్యవస్థకు కొత్త సవాల్ విసురుతున్నాయని అన్నారు. ఈ సదస్సులో చాలా సమస్యలకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని అన్నారు.
వ్యవస్థలో వచ్చే మార్పు ఏదైనా హేతుబద్దంగా,చట్టబద్దంగా ఉండాలన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పులను దేశంలోని 1.3 బిలియన్ల భారతీయులు మనస్పూర్తిగా స్వాగతించారని చెప్పారు. ఇక మహిళల గురించి మాట్లాడుతూ.. లింగ సమానత్వం లేకుండా సంపూర్ణ అభివృద్దిని సాధించడం కష్టమన్నారు మోదీ. మిలటరీ సర్వీసులు మొదలు గనుల్లో రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేసేందుకు కూడా మహిళలకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. మహిళలకు ప్రభుత్వం 26 నెలల మెటర్నిటీ లీవ్ ఇస్తోందన్నారు. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేసే ఈ-కోర్ట్ ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్టులో ప్రతి కోర్టును చేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వివిధ రకాల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో సుప్రీం కోర్టు దేశ పర్యావరణాన్ని పరిరక్షించిందన్నారు.
భారత్ ఇటీవలి నిర్ణయాలపై ప్రపంచమంతా మాట్లాడుకుంటోందన్నారు. ఆరేళ్ల క్రితం భారత్ ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉందని.. ఇటీవల నివేదికలు భారత్ ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని పేర్కొన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే,బ్రిటన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాబర్ట్ రీడ్,ఆస్ట్రేలియా చీఫ్ జస్టిస్లు కూడా పాల్గొన్నారు.