ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పు: రివ్యూ పిటిషన్ వేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం 1989లోని కొన్ని నిబంధనలను సడలిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ గురువారం వెల్లడించారు.
సుప్రీం మార్గదర్శకాలపై తాము పరిశీలన జరిపామని, త్వరలోనే అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుపై సుప్రీం ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలను కేంద్రం పరిశీలించిందని, అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే న్యాయశాఖకు ఆదేశాలు వెళ్లాయని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగం అవుతున్నందున తక్షణ అరెస్టులు చేయరాదని సుప్రీం కోర్టు ఇటీవల పేర్కొంది. డిఎస్పీ స్థాయి అధికారి ప్రాథమిక దర్యాఫ్తు అనంతరమే నిందితులను అరెస్టు చేయాలని, ఒకవేళ ఉద్యోగులపై ఆరోపణలు వస్తే సంబంధిత అధికారి నుంచి ఉత్తర్వులు పొందాకే ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీం తీర్పు చెప్పింది. దీనిపై పునర్విచారణ చేయించాలని ప్రతిపక్షాలు కూడా చెబుతున్నాయి. కేంద్రం కూడా అదే వైఖరితో ఉంది.
బుధవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి సుప్రీం వెలువరించిన తీర్పు దళితుల్లో ఒక రకమైన అభద్రతా భావానికి కారణమైందని చెప్పారు. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని అభ్యర్థించారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని తెలిపారు.