వారు ప్రభుత్వ ఉద్యోగులు కారు: ప్రజాప్రతినిధులు లాయర్లుగా ప్రాక్టీస్ చేయొచ్చన్న సుప్రీంకోర్టు
ఢిల్లీ: ప్రజాప్రతినిధులు లాయర్లుగా ప్రాక్టీసు చేయొచ్చంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ప్రజాప్రతినిధులు లాయర్లుగా ప్రాక్టీస్ చేయడంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్తానం విచారణ చేసింది. ప్రజాప్రతినిధులు లాయర్లుగా ప్రాక్టీస్ చేయరాదంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల్లో ఎక్కడా లేదని కోర్టు స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవుల్లో ఉండగా వారు న్యాయవాది వృత్తిని ప్రాక్టీస్ చేయడంపై నిషేధం విధించాలంటూ బీజేపీ నేత న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
క్రిమినల్ కేసులున్నా సరే...ఎన్నికల్లో పోటీచేయొచ్చు: సుప్రీంకోర్టు
అంతకుముందు కేసుపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తన వాదన వినిపించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజలచే ఎన్నుకోబడ్డవారని వారు పూర్తిస్థాయి ఉద్యోగస్తులు కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది కేంద్రం. అయితే ఉపాధ్యాయ్ తరపున న్యాయవాది ఇందుకు అభ్యంతరం తెలుపుతూ.. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఖజానా నుంచే జీతాలు అందుతాయని అలాంటప్పుడు ప్రభుత్వం వేతనాలు పొందుతున్నవారు న్యాయవాది వృత్తిని చేపట్టరాదని బార్కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తోందని తెలిపారు.
కేసును విచారణ చేసిన ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ల త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ వాదన వైపే మొగ్గు చూపింది. ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఫుల్టైం ఎంప్లాయిస్ కాదని పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రజాప్రతినిధులుగా ఉంటూ లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిలో కేంద్రమాజీ మంత్రి కపిల్ సిబల్, కాంగ్రెస్ నేత అభిషేష్ సింఘ్వీ, కేటీఎస్ తులసి, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, వివేక్ ఠంకా, కే పరసరన్, భూపేంద్ర యాదవ్, మీనాక్షి లేఖి, పినాకి మిశ్రా, సతీష్ మిశ్రా, అశ్విని కుమార్లు ఉన్నారు.