పట్టు వీడని రైతులు, కేంద్రం- ఆరో విడత చర్చలు రద్దు- కొనసాగుతున్న ప్రతిష్టంభన
వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాలతో చర్చించేందుకు కేంద్రం ఇవాళ నిర్వహించాల్సిన ఆరో విడత చర్చలు రద్దయ్యాయి. వ్యవసాయ చట్టాల్లో మార్పులకు సిద్ధమంటూ కేంద్రం పంపుతున్న ప్రతిపాదనలను రైతులు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. నిన్న రాత్రి హోంమంత్రి అమిత్షాతో భేటీ తర్వాత ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో సమావేశమైన రైతు సంఘాల నేతలు కేంద్రంతో ఆరో విడత చర్చలకు హాజరు కాకూడదని నిర్ణయంచారు. దీంతో ఈసారి చర్చలు కూడా రద్దయ్యాయి. ఇటు రైతులు, అటు కేంద్రం కూడా పట్టువీడకపోవడంతో తర్వాత ఏం జరగబోతోందన్నది ఉత్కంఠగా మారింది.
కేంద్రం ప్రతిపాదనలు అంగీకరించని రైతులు
వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల అభ్యంతరాలు, ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఇవాళ వారి ముందు రాతపూర్వక ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. ప్రధానంగా రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతాలతో ఈ మూడు చట్టాల్లో మార్పులు చేస్తామని రాతపూర్వకంగా వారికి తెలియచేయాలని నిర్ణయించింది. అయితే రైతులు వీటిని లెక్కచేసే పరిస్ధితుల్లో లేరు. నిన్న రాత్రి హోంమంత్రి అమిత్షాతో భేటీ తర్వాత ఇవాళ హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో సమావేశమైన రైతు సంఘాల నేతలు కేంద్రంపై నమ్మకం లేదని ప్రకటించారు. ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడం మినహా మరే ప్రతిపాదనకూ తాము తలొగ్గేది లేదని తేల్చిచెప్పారు.
ఆరో విడత చర్చలు రద్దు...
కేంద్రం వ్యవసాయ చట్టాల్లో సవరణలను ప్రతిపాదిస్తూ రాతపూర్వకంగా ప్రతిపాదనలు పంపడం ద్వారా తమను మోసం చేయాలని భావిస్తున్న రైతు సంఘాలు.. ఇవాళ వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్తో జరగాల్సిన ఆరో విడత చర్చలకు రాబోమని తేల్చిచెప్పాయి. దీంతో చర్చలు రద్దయిపోయాయి. ఇప్పటికే ఐదు విడతలుగా జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం, కేంద్రం, రైతు సంఘాలు కూడా తమ డిమాండ్లకు కట్టుబడటంతో ఈసారి చర్చల వల్ల ఉపయోగం లేదని తేలిపోయింది. ఆరో విడత చర్చలు రద్దయిన నేపథ్యంలో తదుపరి చర్య ఏమిటన్నది కేంద్రం సూచించాల్సి ఉంది.
వ్యవసాయ చట్టాల్లో కేంద్రం ప్రతిపాదిత సవరణలివే...
రైతుల ఆందోళనల నేపథ్యంలో వ్యవసాయ చట్టాల్లో కేంద్రం కొన్ని కీలక సవరణలకు ప్రతిపాదిస్తోంది. ఇందులో కనీస మద్దతు ధర తప్పనిసరిగా కొనసాగేలా మార్పు చేయనున్నారు. అలాగే రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ బిల్లు వల్ల రైతులకు ఎలాంటి నష్టం లేదని, ఇది కేవలం విద్యుత్ పంపిణీ సంస్ధలపై నిఘా కోసమే అని చెప్పిన కేంద్రం.. ఇప్పుడు రైతుల ఆందోళనతో ఇందులో వివాదాలపై ఉన్నత న్యాయస్ధానాల్లో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించడాన్ని పరిశీలిస్తోంది. అయినా రైతులు వీటిని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు. మొత్తం మూడు చట్టాలు ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.