పాల్ఘర్ కేసులో అనూహ్య ఘటన.. లాయర్ త్రివేది దుర్మరణం.. బీజేపీ అనుమానాలు..?
పాల్ఘర్ హిందూ సాధువుల హత్య కేసును వాదిస్తున్న న్యాయవాది దిగ్విజయ్ త్రివేది బుధవారం(మే 14) ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జూనియర్ న్యాయవాది అయిన త్రివేది సీనియర్ న్యాయవాదులైన పీఎన్ ఓజా,అరుణ్ ఉపాధ్యాయ్లతో కలిసి పాల్ఘర్ కేసును వాదిస్తున్నాడు. బుధవారం ఇదే కేసుకు సంబంధించి దహను కోర్టుకు బయలుదేరిన త్రివేది మార్గమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు.
కరోనాను మించి.. అగ్గిరాజేసిన హీరోయిన్ జ్యోతిక.. మండిపడుతోన్న హిందూ వాదులు..
ప్రమాదం ఎలా జరిగింది..
పోలీసుల కథనం ప్రకారం.. దహను కోర్టుకు బయలుదేరిన సమయంలో కారును త్రివేదియే నడుపుతున్నాడు. ఆయనతో పాటు తన సహోద్యోగి ప్రీతి ద్వివేది కూడా కారులో ఉన్నారు. అయితే అతివేగం కారణంగా అదుపు తప్పిన కారు ముంబై-అహ్మదాబాద్ హైవేపై డివైడర్ను ఢీకొట్టింది. దీంతో త్రివేది అక్కడిక్కడే మృతి చెందాడు. ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదంపై బీజేపీ అనుమానం..
త్రివేది మృతి పట్ల బీజేపీ నేత సంబిత్ పాత్ర అనుమానం వ్యక్తం చేశారు. 'పాల్ఘర్ కేసులో వీహెచ్పీ న్యాయవాది దిగ్విజయ్ త్రివేది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్త నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమేనా లేక కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన కుట్రా..?,దీనిపై విచారణ జరిపించాలి' అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదే కేసును వాదిస్తున్న న్యాయవాది పీఎన్ ఓజా మాట్లాడుతూ.. త్రివేదికి వీహెచ్పీ లేదా బీజేపీతో ఎటువంటి సంబంధం లేదన్నారు. అతను ఎవరితోనూ అసోసియేట్ అవలేదన్నారు. ప్రమాదానికి అసలు కారణమేంటన్నది ఆర్టీఓ రిపోర్టులో మాత్రమే స్పష్టంగా వెల్లడవుతుందని చెప్పారు. త్రివేది జూనియర్ న్యాయవాది అని,ప్రాక్టీస్ పట్ల అతనికి ఉన్న ఆసక్తితో ఈ కేసులో స్థానం కల్పించానని తెలిపారు.
కుట్ర ఆరోపణలను కొట్టిపారేసిన పోలీసులు
పోలీసులు మాత్రం ఇది రోడ్డు ప్రమాదమే అని స్పష్టం చేశారు. దీని వెనకాల ఎలాంటి కుట్ర లేదని చెప్పారు. అతివేగం కారణంగా కారు అదుపు తప్పడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. బుధవారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. త్రివేది బహుజన్ వికాస్ అఘాడీ అనే పొలిటికల్ పార్టీ న్యాయ విభాగానికి చీఫ్గా కూడా పనిచేస్తున్నాడు.
Recommended Video
పాల్ఘర్ హిందూ సాధువుల కేసు..
పాల్ఘర్లో ఇటీవల మూక దాడిలో ఇద్దరు హిందూ సాధువులు మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సాధువులు కారులో సూరత్కు వెళ్తున్న సమయంలో పాల్ఘర్లో కొందరు అడ్డుకున్నారు. వాళ్లను కారు నుంచి బయటకు దించి దాడి చేశారు. ఈ దాడిలో సాధువులతో పాటు డ్రైవర్ కూడా మరణించాడు. దొంగలు అన్న అనుమానంతో స్థానికులు వారిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ 110 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది.