న్యాయవాదులకు నల్లకోటు అవసరం లేదు..!తాజా ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్ట్..!
ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలోని న్యాయవాదుల అసలు రంగు మారబోతోంది. ఏదో ఊహించుకోకండి. న్యాయవాదుల డ్రెస్ కోడ్ మారబోతుందన్న మాట. కర్కషంగా కనబడే నల్లకోటుకు చెక్ పెట్టేందుకు సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. న్యాయ స్ధానాల్లో నిత్యం యస్ యువరానర్ అనే న్యాయవాదులు వేసుకునే నల్ల కోటును ఇక మీదట ధరించి కోర్టుకు కావాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
నల్లకోటు ధరించడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, న్యాయవాదుల డ్రెస్ కోడ్ అంశంలో మార్పులు చేయాల్సిందిగా గతంలో కొంత మంది న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానాకి విజ్ఞప్తులు చేసుకున్న సందర్బాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ ఈ కీలర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.సుమారు రెండు నెలలుగా కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణలు కొనసాగిస్తున్న న్యాయవాదుల పట్ల సుప్రీం కోర్ట్ స్పందించింది.
ఇందులో భాగంగా ఓ వినూత్న ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టు సెక్రెటేరియట్ నుంచి చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ అయ్యాయి. దేశంలోని అన్ని న్యాయస్థానాలకు పలు సూచనలతో సర్క్యులర్ జారీ చేసింది. ఇకపై న్యాయస్థానాలలో కేసులు వాదిస్తున్న న్యాయవాదులు నల్లకోటు ధరించ రాదన్నది బుధవారం జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం.
పురుష న్యాయవాదులు తెల్ల డ్రెస్ అంటే తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు ధరించాలని నిర్దేశించింది. మహిళా న్యాయవాదులు పంజాబీ డ్రెస్ లేదా సల్వార్ కమీజ్ లేదా తెల్ల చీరతో వాదనలు వినిపించాలని ఆదేశాలిచ్చారు. సుప్రీం బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మీదట న్యాయవాదులు తెలుపురంగు దుస్తుల్లో న్యాయం కోసం స్వచ్చమైన వాదనలు వినిపిస్తారన్న మాట..!