లాయర్లు వర్సెస్ పోలీసులు: నిరసనలతో హోరెత్తిన ఢిల్లీ...ఆత్మాహత్యాయత్నం చేసిన లాయర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు మరియు లాయర్లు మధ్య రాజుకున్న వివాదం తీవ్రంగా మారుతోంది. రోహిణీ కోర్టు బయట ఓ లాయర్ ఆత్మాహత్యా ప్రయత్నం చేశారు. గమనించిన తోటి లాయర్లు వెంటనే ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
లాయర్ ఆత్మహత్యాయత్నం
ఢిల్లీలో పోలీస్ లాయర్ల మధ్య వివాదం తీవ్రతరంగా మారుతోంది. రోహిణీ కోర్టు బయట నిరసల్లో పాల్గొన్న లాయర్లు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేసమయంలో ఆశిష్ అనే లాయర్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతవరణం కనిపించింది. ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ బయట మంగళవారం పోలీసులు నిరసనలు తెలిపిన మరుసటి రోజు లాయర్లు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. నవంబర్ 2వ తేదీన తీస్ హజారీ కోర్టులో పార్కింగ్ సందర్భంగా తలెత్తిన వివాదం లాయర్లు, పోలీసుల మధ్య గొడవకు దారి తీసింది. ఆ తర్వాత సాకేత్ కోర్టు బయట ఓ పోలీస్ కానిస్టేబుల్పై లాయర్లు దాడి చేసిన ఘటన నవంబర్ 4వ తేదీన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే దాడికి పాల్పడ్డ లాయర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు ఘటనలో బదిలీకి గురైన ఇద్దరు పోలీసు అధికారులను వెంటనే అదే స్థానంలో పోస్టింగ్ ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేయాలి
తీస్ హజారీ కోర్టులో పోలీసులపై దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్క లాయర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని పోలీసులు డిమాండ్ చేశారు. ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ను పోలీసు ఉన్నతాధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పట్టుబట్టారు. లాయర్లకు పోలీసులకు మధ్య జరుగిన గొడవకు సంబంధించి కేసును విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు విచారణ జరుగుతున్నందున రెండు సీనియర్ ఆఫీసర్లను బదిలీ చేయాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో ఓ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ను కూడా సస్పైండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.
పోలీసులకు మద్దతుగా కిరణ్ బేడీ ట్వీట్
ఇదిలా ఉంటే మంగళవారం నిరసనల కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తిరిగి రావాలని చెబుతూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులకు మద్దతుగా నిలుస్తున్నట్లు కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఢిల్లీ పోలీసులకు మద్దతు లభిస్తోంది. కేరళ ఐపీఎస్ అసోసియేషన్, సెంట్రల్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అసోసియేషన్, బీహార్ పోలీస్ అసోసియేషన్, తమిళనాడు ఐపీఎస్ అసోసియేషన్లు ఢిల్లీ పోలీసులకు బాసటగా నిలిచాయి.
ఢిల్లీ కమిషనర్కు అడ్వకేట్ నోటీసులు
మరోవైపు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్కు సుప్రీంకోర్టు లాయర్ లీగల్ నోటీసులు పంపారు. ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిరసనలు చేపట్టిన పోలీసులపై చర్యలు తీసుకోకపోవడంతో కమిషనర్కు నోటీసులు పంపారు. పోలీసు నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నోటీసులో సుప్రీంకోర్టు అడ్వకేట్ పేర్కొన్నారు.