ఎఫ్ఐఆర్ లో గాలి జనార్దన్ రెడ్డి పేరు లేదు: బెంగళూరులో ఉన్నారు, న్యాయవాది క్లారిటీ!
బెంగళూరు: ఆండిడెంట్ చీటింగ్ స్కాం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పేరు లేదని ఆయన న్యాయవాదులు అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి మీద ఇంత వరకూ సీసీబీ పోలీసులకు ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యలేదని ఆయన న్యాయవాది చంద్రశేఖర్ అన్నారు.
ఆండిడెంట్ చీటింగ్ కేసుకు సంబంధించి బెంగళూరులోని డీజేహళ్ళి పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన ఎఫ్ఐఆర్ కాపి తన చేతికి వచ్చిందని గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాది చంద్రశేఖర్ చెప్పారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీలోని వివరాలను న్యాయవాది చంద్రశేఖర్ వివరించారు.
ఆండిడెంట్ చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ లో మహమ్మద్ ఫరీద్ (ఏ1), సయ్యద్ ఆఫక్ అహమ్మద్ (ఏ2), ఇర్ఫాన్ మీర్జా (ఏ3) పేర్లు ఉన్నాయని గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాది చంద్రశేఖర్ అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీలో గాలి జనార్దన్ రెడ్డి పేరు మాత్రం లేదని ఆయన అంటున్నారు.
ఇలాంటి సందర్బంలో బెంగళూరు సీసీబీ పోలీసులు ఎందుకు ప్రత్యేక బృందాలతో గాలి జనార్దన్ రెడ్డి కోసం గాలిస్తున్నారో అర్థం కావడంలేదని న్యాయవాది చంద్రశేఖర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆండిడెంట్ చీటింగ్ కేసును ఎంసీఎస్ చట్టం కింద నమోదు చేశారని న్యాయవాది చంద్రశేఖర్ వివరించారు.
గాలి జనార్దన్ రెడ్డి ఎలాంటి తప్పు చెయ్యలేదని, ఆయన ఎక్కడికి పారిపోలేదని, బెంగళూరులోనే ఉన్నారని ఆయన న్యాయవాది చంద్రశేఖర్ మీడియాకు చెప్పారు. శుక్రవారం బెంగళూరు సెషన్స్ కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ ఫిటిషన్ దాఖలు చేస్తామని గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాది చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
ఆండిడెంట్ చీటింగ్ కేసు విచారణలో గాలి జనార్దన్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చిందని పోలీసులు అంటున్నారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ లో గాలి జనార్దన్ రెడ్డి పేరు చేర్చి ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.