నేరవేర్చలేని హామీలిస్తే ప్రజలే పార్టీలకు బుద్ధి చెబుతాయి: నితిన్ గడ్కరీ మోడీని టార్గెట్ చేశారా..?
ముంబై: నెరవేర్చని హామీలు ఇస్తే నాయకులను ప్రజలు రాజకీయంగా దెబ్బకొడుతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. అంతేకాదు హామీలపై స్పష్టత లేకుంటే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీలకు ఓటువేయరని చెప్పారు. గతేడాది డిసెంబరులో జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఓటమిపాలయ్యాక నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కచ్చితంగా బీజేపీని ఇరుకునపెట్టే పరిణామం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హామీలిచ్చే నాయకులంటే ఇష్టం...కానీ తప్పితే దెబ్బకొడతారు
ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. "పెద్ద పెద్ద వాగ్దానాలు చేసే నాయకులంటే ప్రజలకు ఇష్టం. కానీ ఆ హామీలను నెరవేర్చకుంటే అదే ప్రజలు రాజకీయంగా దెబ్బకొడుతారు" అని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. అందుకే ఏ హామీలు అయితే నెరవేర్చగలమో అలాంటి హామీలకు మాత్రమే పార్టీలు పరిమితం కావాలని హితవు పలికారు. అయితే నెరవేర్చని హామీలు తాను ఎప్పుడూ ఇవ్వనని తానేమి చేయగలనో అవి మాత్రమే హామీలుగా ఇస్తానని చెప్పుకొచ్చారు నితిన్ గడ్కరీ.
కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: సీఎంగా దిగిపోయేందుకు సిద్ధం..కాంగ్రెస్ వైఖరే కారణమా..?
మోడీని అమిత్ షాలే టార్గెట్గా గడ్కరీ వ్యాఖ్యలు చేశారా..?
గతేడాది డిసెంబరులో మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఓటమి చవిచూసింది బీజేపీ. గెలుపోటములను ఒకేలా స్వీకరించగలిగే సత్తా పార్టీలకు నాయకులకు ఉండాలని స్పష్టం చేశారు గడ్కరీ. అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ప్రధాని నరేంద్రమోడీకి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షాలకు తగిలేలా గడ్కరీ సంధించారని చాలా మంది భావిస్తున్నారు. అంతేకాదు మోడీని, అమిత్షాల స్థానాల్లో మార్పు జరగాలనే సంకేతాలు పరోక్షంగా గడ్కరీ పంపించారనే భావన కలుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తన వ్యాఖ్యలను విపక్షాలు, ఒక వర్గం మీడియా వక్రీకరిస్తున్నాయని తన ఇమేజ్ను పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని గడ్కరీ వివరణ ఇచ్చారు. ఇలా వ్యవహరించి రాజకీయంగా లబ్దిపొందాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు గడ్కరీ.
గడ్కరీపై ప్రశంసలు కురిపించిన అరవింద్ కేజ్రీవాల్
మహారాష్ట్ర రైతు నేత కిషోర్ తివారీ ఆర్ఎస్ఎస్కు లేఖ రాశారు. మోడీ స్థానంలో గడ్కరీని నియమించాలని ఆ లేఖలో పేర్కొన్నారు కిషోర్ తివారి. అదేసమయంలో గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. అంతేకాదు ఈనెల ప్రారంభంలోనే సీనియర్ బీజేపీ నేత సంఘ్ప్రియ గౌతమ్ గడ్కరీని ఉపప్రధానిగా చేయాలనే వాదన వినిపించారు. మరోవైపు గణతంత్ర వేడుకల్లో నితిన్ గడ్కరీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పక్కనే కూర్చుని ఏదో మాట్లాడుతున్నట్లు కెమెరా కంటికి చిక్కాయి. మరోవైపు గడ్కరీ పనితీరుపై చాలా సంతృప్తి వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గడ్కరీని ఇతర బీజేపీ నేతలతో పోల్చలేమని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. గడ్కరీ తమ ప్రత్యర్థి అనే భావన తనకు ఎప్పుడూ కలగలేదని వివరించారు.