56 ఇంచెస్ ఛాతి: మోడీపై మళ్లీ నితీష్, తండ్రీకూతుళ్లు బ్రేకప్ కోసమా: ఒమర్
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ పైన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయద్ చేసిన వ్యాఖ్యల పైన ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని నితీష్ పరోక్షంగా నిలదీశారు.
56 అంగులాల ఛాతి కలిగిన నేతలు ముఫ్తీ ప్రకటన పైన సమాధానం చెప్పాలని, జమ్మూ కాశ్మీర్లో ఈ సంకీర్ణం జమ్మూ కాశ్మీర్ ప్రజలను కచ్చితంగా విడదీస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ.. బీజేపీ, పీడీపీ పార్టీలకు విభిన్న భావజాలం, విధానం ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పాటు చేశాక రెండు పార్టీలు రెండు రకాల అభిప్రాయాలు వెలిబుచ్చాయని అన్నారు. ఈ సంకీర్ణ ప్రభుత్వం దీర్ఘకాలం కొనసాగుతుందని తాను అనుకోవడం లేదన్నారు.
మోడీ - ముఫ్తీ కూటమి (బీజేపీ - పీడీపీ కూటమి) తప్పు అని ముఫ్తీ నిర్ణయానికి వచ్చి ఉంటారని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ముఖ్యమంత్రి, ఆయన కూతురు ఇద్దరు కలిసి బిజేపీతో బ్రేకప్ కోసం ప్రయత్నాలు చేస్తుండవచ్చునని అన్నారు.
కాగా, తన తండ్రి యుద్ధ పిపాసి కాదని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ ముఫ్తీ సయీద్ కూతురు, మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో వాజపేయి కొనసాగించిన విధానాలే కొనసాగాలని తన తండ్రి ఆకాంక్షిస్తున్నారన్నారు. దేశ సరిహద్దులో సైన్యం ఎప్పుడు ఉంటుందన్నారు. జమ్మూ కాశ్మీర్ అంశంతో పాటు ప్రతి సమస్య చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్నారు.