పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా ఖాయం..!! సాయంత్రం కీలక భేటీ : నెక్స్ట్ సీఎం రేసులో జక్కర్..!!
పంజాబ్ కాంగ్రెస్ రాజకీయం క్లైమాక్స్ కు చేరింది. కొంత కాలంగా సీఎం అమరీందర్ వర్సెస్ సిద్దూ అన్నట్లుగా సాగుతున్న పంజాబ్ కాంగ్రెస్ రాజకీయం ఈ రోజు కొత్త మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ రాజీనామాకు సిద్దమయ్యారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియాకు సైతం నివేదించినట్లుగా చెబుతున్నారు. కొంత కాలంగా సిద్దూ వ్యవహార శైలితో తాను విసిగిపోయానంటూ అమరీందర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ముదిరిన పంజాబ్ సంక్షోభం
ఇద్దరి మధ్య ముదిరిన విభేదాలతో ఈ మథ్య కాలంలో హైకమాండ్ సిద్దూకు పంజాబ్ పీసీసీ బాధ్యతలు అప్పగించింది. అయినా..పార్టీ ఎమ్మెల్యేలతో సిద్దూ తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అమరీందర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను కొనసాగలేనని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులు క్రితం కొందరు ఎమ్మెల్యేలు సీఎం అమరీందర్ ను తప్పించాలంటూ సోనియాకు లేఖ రాసినట్లు సమాచారం.
అమరీందర్ రాజీనామాకు సిద్దం
అమరీందర్..సిద్దూ మధ్య సయోధ్య కోసం హైకమాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. మరి కొందరు ఎమ్మెల్యేలు వెంటనే పార్టీ లెజిస్లేచర్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో..పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఈ సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సమావేశం ఇప్పుడు కీలకంగా మారింది. తాజాగా గుజరాత్ లో సీఎం విజయ్ రూపానీ మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చిన విధంగానే పంజాబ్ లోనూ నిర్ణయం తీసుకోవాలని పార్టీలోని అమరీందర్ వ్యతిరేకులు డిమాండ్ చేస్తున్నారు.
సాయంత్రం కీలక భేటీ..కొత్త సీఎం ఎంపికకు ఛాన్స్
అమరీందర్ కేబినెట్ లోని నలుగురు మంత్రులు సహా డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వానికి సీఎం ను మార్చాలంటూ లేఖ రాసారు. ఎన్నికల హామీలను అమలు చేయటంలో అమరీందర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా సీఎం ను తప్పించాలని వారు కోరుతున్నారు. దీంతో..అమరీందర్ ను తప్పిస్తే ఆ స్థానం భర్తీ చేసే వారి పైన కాంగ్రెస్ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.
కొత్త సీఎంగా సనీల్ జక్కర్ కు ఛాన్స్
అందులో ప్రధానంగా మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జక్కర్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే, హైకమాండ్ సైతం అమరీందర్ ను మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీంతో..అమరీందర్ సాయంత్రం సమావేశానికి ముందుగానే రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. సీఎల్పీ సమావేశంలో తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకొనే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో..ఎన్నికల ముందు పంజాబ్ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.