15 రోజుల పాటు గ్యాంగ్ రేప్... ఆడియో టేపు వైరల్... బాధితురాలి తల్లితో న్యూస్ చానెల్ ఎండీ...
ఒడిశాలో ఓ ఆడియో టేపు కలకలం రేపుతోంది. ఓ అత్యాచార బాధితురాలి తల్లి,ఓ టీవీ చానెల్ ఎండీకి మధ్య జరిగిన ఆ సంభాషణ తాలుకు ఆడియో టేపు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అత్యాచార కేసులో బాధితురాలి తల్లి న్యాయ పోరాటాన్ని ప్రభావితం చేసేలా సదరు చానెల్ ఎండీ ఆమెతో సంభాషించారు.మధ్యేమార్గంగా ఆఫీస్కు పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే... భువనేశ్వర్లో ఉన్న ఓ ప్రైవేట్ న్యూస్ చానెల్ కార్యాలయంలో రిసెప్షనిస్ట్గా పనిచేసే ఓ మహిళ ఇటీవల ఒడిశా బాలల హక్కుల కమిషన్(OSCPCR)కు ఓ ఫిర్యాదు చేసింది. తాను పనిచేసే కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగులు మైనర్ బాలిక అయిన తన కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఏప్రిల్-మే మధ్యలో దాదాపు 15 రోజుల పాటు ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారని చెప్పింది.
తన కుమార్తె కాళ్లు,చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిపింది. అంతేకాదు,గ్యాంగ్ రేప్ సమయంలో సెల్ఫోన్లో వీడియోలు కూడా రికార్డ్ చేశారని చెప్పింది. ఈ విషయం బయటకు పొక్కితే తన కుమార్తెతో పాటు తననూ చంపేస్తారని బెదిరించినట్లు ఆరోపించింది. ఇదే విషయాన్ని చానెల్ ఎండీ,బీజేపీ నేత బైజయంత్ పాండా దృష్టికి తీసుకెళ్లినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయింది. అంతేకాదు,ఈ కేసులో తదుపరి న్యాయ పోరాటాన్ని విరమించుకోవాలని తనపై ఎండీ పాండా ఒత్తిడి తెచ్చినట్లుగా ఆరోపించింది.
ఈ నేపథ్యంలోనే బాధితురాలి తల్లికి ఫోన్ చేసిన చానెల్ ఎండీ పాండా ఆమెను చానెల్ కార్యాలయానికి రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికొస్తే అన్ని విషయాలు మాట్లాడుదామని... ఆ తర్వాత ఏ చర్యలైనా తీసుకోమని అన్నాడు. తాజాగా ఈ ఆడియో టేపు బయటకు లీకై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీని ఆధారంగా ఒడిశా బాలల హక్కు సంఘం పాండాపై కూడా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసింది. ఈ ఘటనపై 48 గంటల్లోగా విచారణ నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్థానిక పోలీసులను ఆదేశించారు.