బండారం బట్టబయలు..? టీఆర్పీ స్కామ్లో అర్నబ్ వాట్సాప్ చాట్ లీక్.. వెలుగులోకి దిమ్మతిరిగే సంచలనాలు..
దేశంలో సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణంలో మరిన్ని సంచలనాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి, ఇప్పటికే అరెస్టయిన బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాల వాట్సాప్ సంభాషణ బయటకు లీకైంది. ముంబై పోలీసులు దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్లో ఈ చాటింగ్కి సంబంధించిన సాక్ష్యాలు ఉండగా... తాజాగా అవి బయటకు లీక్ అవడం గమనార్హం.
1000 పేజీల వాట్సాప్ సంభాషణలు...
ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తో ఉన్న యాక్సెస్ను అర్నబ్ గోస్వామి దుర్వినియోగం చేశాడనేందుకు దాస్ గుప్తాతో అతని వాట్సాప్ సంభాషణలు బలం చేకూరుస్తున్నాయి. అంతేకాదు,బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్,కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు వంటి కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయాలు కూడా అర్నబ్కు ముందే తెలిశాయా... అన్న సందేహాలకు ఆ సంభాషణలు ఊతమిస్తున్నాయి. ముంబై పోలీసులు దాఖలు చేసిన 3400 పేజీల సప్లిమెంటరీ చార్జిషీట్లో దాదాపు 1000 పేజీలు అర్నబ్ గోస్వామి-దాస్ గుప్తా వాట్సాప్ సంభాషణలకు సంబంధించిన పేజీలే కావడం గమనార్హం.
అవసరమైతే పీఎంవో నుంచి సాయం చేస్తానని...
2017 ఆరంభం నుంచి మొదలు అక్టోబర్ 10,2020 వరకూ అర్నబ్ గోస్వామి,పార్థో దాస్ గుప్తా మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను పోలీసులు సేకరించారు. రిపబ్లిక్ టీవీ ఛానెల్ను టీర్పీలో ఎలా టాప్లో నిలపాలన్న దానిపై ఈ ఇద్దరు తరుచూ సంభాషించారు. అంతేకాదు,రిపబ్లిక్ టీవీ కన్నా టీర్పీలో ముందున్న ప్రత్యర్థి ఛానెల్స్ పట్ల పలుమార్లు ఇద్దరు విచారం వెలిబుచ్చారు. అంతేకాదు, టీఆర్పీకి సంబంధించి అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి సాయం చేస్తానంటూ అర్నాబ్ గోస్వామి భరోసా ఇచ్చినట్టు ఆ చాట్స్లో స్పష్టంగా కనిపిస్తోంది.
విస్తుపోయే విషయాలు...
లీకైన వాట్సాప్ సంభాషణల్లో ఓ కేంద్రమంత్రిని ఉద్దేశించి పార్థో దాస్ గుప్తా 'యూజ్ లెస్' అని సంబోధించడం గమనార్హం. 'మంత్రులంతా మనతోనే ఉన్నారు..' అని అర్నబ్ గోస్వామి మరో మెసేజ్లో చెప్పుకొచ్చాడు. కుదిరితే పీఎంవో కార్యాలయంలో మీడియా అడ్వైజర్ పోస్టు తనకు ఇప్పించాలని దాస్ గుప్తా అర్నబ్ను కోరాడు. ఫిబ్రవరి 14,2019న కశ్మీర్లోని పుల్వామాలో భారత సైన్యంపై జరిగిన దాడి తమ ఛానెల్కు చాలా ఉపయోగపడిందని అర్నబ్ దాస్ గుప్తాతో చెప్పాడు.ఫిబ్రవరి 26,2019న పాకిస్తాన్లోని బాలాకోట్పై భారత్ వైమానిక దాడులు జరపగా... అంతకు మూడు రోజుల ముందే ఫిబ్రవరి 23న అర్నబ్ ఈ విషయాన్ని వాట్సాప్లో పేర్కొన్నాడు. 'ఏదో పెద్దదే జరగబోతుంది..' అని అర్నబ్ పేర్కొనగా.. 'దావూద్?' అంటూ దాస్ గుప్తా ప్రశ్నించాడు. అందుకు అర్నబ్ 'కాదు సార్.. పాకిస్తాన్... ఈసారి ఏదో పెద్దదే జరగబోతుంది... సాధారణ దాడి కన్నా పెద్ద దాడి జరగవచ్చు.' అని పేర్కొన్నాడు. దీన్నిబట్టి మిలటరీ ఆపరేషన్స్పై కూడా అర్నబ్కు ముందుగానే సమాచారం ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ట్విట్టర్లో షేర్ చేసిన ప్రశాంత్ భూషణ్...
దాస్ గుప్తా,అర్నబ్ గోస్వామి మధ్య వాట్సాప్ చాట్ను న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. 'ఆ ఇద్దరి మధ్య చాట్కి సంబంధించి బహిర్గతమైన కొన్ని స్క్రీన్ షాట్స్. దీన్ని బట్టి అనేక కుట్రలు,అతని మీడియా దుర్వినియోగం,పవర్ బ్రోకర్గా పలుకుబడిని వాడుకోవడం కనిపిస్తోంది. దేశంలో ఉన్న ఏ చట్ట ప్రకారమైన అతనికి సుదీర్ఘ కాలం జైలు శిక్ష పడుతుందని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.