ఆర్ఎస్ఎస్ను చూసి నేర్చుకొండి.. పార్టీ శ్రేణులకు పవార్ సూచన..
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంపై పోస్ట్మార్టం నిర్వహిస్తున్న ఎన్సీపీ పనిలో పనిగా భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మరోసారి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అసెంబ్లీ ఎన్నికల కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలన్న శరద్ పవార్ పార్టీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాలని సూచించారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనుసరిస్తున్న విధానాలను అనుసరించాలని అన్నారు. దీనికి సంబంధించి ఓ బీజేపీ నేత తనతో పంచుకున్న విషయాలను పవార్ గుర్తు చేసుకున్నారు.
"ఎన్సీపీ కార్యకర్తలు ఓటర్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే పాంప్లెట్ను అక్కడ వదిలేసి వెళ్లిపోతారు. అదే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఒకవేళ ఓటర్లు ఇంట్లో లేకపోతే సాయంత్రం వెళ్తారని, అప్పుడు కలవకపోతే మరుసటి రోజు వెళ్తారు. అలా వాళ్లను కలిసే వరకు ఆ ఇంటికి వెళ్తూనే ఉంటార"ని బీజేపీ నేత చెప్పినట్లు శరద్ పవార్ పార్టీ శ్రేణులతో అన్నారు.
ఆర్ఎస్ఎస్ నుంచి అన్ని విషయాలు నేర్చుకోమని తాను అనడం లేదని శరద్ పవార్ అన్నారు. కానీ ఓటర్లను కలిసే విషయంలో మాత్రం ఆర్ఎస్ఎస్ చూపే నిబద్ధత పట్టుదలను చూపాలని సూచించారు.
ప్రధాని కేదార్నాథ్ పర్యటనకు వెళ్లడంపై శరద్ పవార్ మండిపడ్డారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా ప్రధాని గుహల్లోకి వెళ్లి ధ్యానం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని ప్రమాణస్వీకారానికి హాజరుకాకపోవడంపై స్పందించిన పవార్ తనకు ఐదో వరుసలో సీటు కేటాయించినందునే ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని చెప్పారు.
రంగంలోకి ఆర్ఎస్ఎస్.. రాజ్నాథ్కు పెరిగిన ప్రాధాన్యం