జరిగింది మర్చిపోయి క్యాంపస్కు వచ్చేయండి.. JNU సేఫ్ ప్లేస్.. విద్యార్థులకు వీసీ పిలుపు
''మన క్యాంపస్ లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరం. గాయాలపాలైన విద్యార్థులందరిపట్లా మాకు సానుభూతి ఉంది. ఒక్కటిమాత్రం నేను బలంగా చెప్పగలను.. జేఎన్యూ చాలా చలా సేఫ్ ప్లేస్. జరిగిపోయినదాన్ని మర్చిపోయి.. అందరూ క్యాంపస్ లోకి వచ్చేయండి. అందరం కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దాం''అని జేఎన్యూ వైస్ చాన్సలర్ జగదీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థులను ఉద్దేశించి ఒక అధికారిక ప్రకటన చేశారు.
తమరు తప్పుకుంటేనే..
జేఎన్యూ క్యాంపస్ లో విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి జరిగితే వీసీ పట్టించుకోలేదని, ఆయన ప్రోద్బలంతోనే హిందూత్వ గుండాలు రెచ్చిపోయారని, ఇందుకు పోలీసులు కూడా సహకరించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్ కు రావాలంటూ వీసీ ఇచ్చిన పిలుపును తాము తిరస్కరిస్తున్నామన్న విద్యార్థులు.. జగదీశ్ కుమార్ తన పోస్టుకు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గేటు బయటే నిరసనలు..
తమపై దాడిని నిరసిస్తూ, బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ జేఎన్యూ విద్యార్థులు ఆదివారం రాత్రి నుంచి ఆందోళన బాట పట్టారు. క్యాంపస్ లో తమకు రక్షణ లేదంటూ.. గేటు బయటే కూర్చొని నిరసనలు తెలుపుతున్నారు. వారికి మద్దతుగా దేశంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో సంఘీభావ ర్యాలీలు జరిగాయి. మంగళవారం సాయంత్రం కూడా జేఎన్యూలో స్టూడెంట్లు గేటు బయటే నిలబడి ఫ్లకార్డులు ప్రదర్శించారు.
ఏచూరి పరామర్శ
జేఎన్యూ హింసలో గాయపడ్డ విద్యార్థుల్ని సీపీఎం నేత సీతారాం ఏచూరి మంగళవారం పరామర్శించారు. క్యాంపస్ సేఫ్ అని ప్రకటన చేసినంత మాత్రాన వీసీ జగదీశ్ తప్పులు మాఫీ కాబోవని, వెంటనే పదవికి రాజీనీమా చేయాలని ఏచూరి డిమాండ్ చేశారు. కాగా, మంగళవారం జేఎన్యూలో ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోలేదని, అంతా ప్రశాంతంగా ఉందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.