దారుణం: క్లాస్లోనే లెక్చరర్ను కాల్చి చంపిన విద్యార్థి
సోనిపత్: హర్యానా రాష్ట్రంలోని సోనెపత్ జిల్లా షాహేబ్ దల్బీర్సింగ్ కశాశాలలో మంగళవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. చదువు చెప్పే అధ్యాపకుడినే ఓ విద్యార్థి అత్యంత దారుణంగా తరగతి గదిలోనే తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనలో రాజేశ్ మాలిక్ అనే అధ్యాపకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. నిందిత విద్యార్థి నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో రాజేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థిని గుర్తించామని, అతని కోసం గాలింపు ప్రారంభించామని పోలీసులు చెప్పారు. అధ్యాపకుడిని ఎందుకు హత్య చేశాడనే దానికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు.
కాగా, రాజేష్ మాలిక్ మృతి చెందాడన్న వార్త విని ఆయన తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాజేష్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.