వేలకోట్ల ఆస్తికోసం యువతి హత్య: 'దృశ్యం' సినిమాలా
భోపాల్: తనకు చట్ట ప్రకారం దక్కాల్సిన ఆస్తి కోసం పోరాడిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ పాఠశాలలో ఉద్యోగాన్ని వదిలేసి వదిలేసి, తన ఆస్తి దక్కించుకోవడం కోసం పోరాడే క్రమంలో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పేరు లీనా శర్మ.
లీనా శర్మను పథకం ప్రకారం హత్య చేసిన దుండగులు.. కేసును తప్పుదోవ పట్టించేందుకు 'దృశ్యం' సినిమాను ఆధారంగా చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. లీనాకు సంబంధించిన రెండు ఫోన్లను దుండగులు జబల్ పూర్ రైల్లో పడేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.
అంతేకాదు, ఆధారాలు దొరకకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఉప్పు, యూరియా మిశ్రమంతో పూడ్చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రదీప్తో పాటు మరో ఇద్దరు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు.
ఏం జరిగింది?
లీనా శర్మ ఢిల్లీలో ఉద్యోగం చేసేది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సోహగ్ పూర్లో కోట్ల రూపాయల విలువ చేసే భూములు, ఆస్తులు తాత, తల్లికి ఉన్నాయి. లీనా శర్మ తల్లి, తాత మరణించారు. వారి మరణంతో ఆ ఆస్తులకు లీనా శర్మ వారసురాలైంది.
అయితే, ఆ ఆస్తుల పైన కన్నేసిన లీనా మామ ప్రదీప్ ఆమెను ఢిల్లీ నుంచి పథకం ప్రకారం రప్పించి హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు పదిహేను రోజులుగా కనిపించకుండా పోయిన లీనా శర్మ కోసం స్నేహితులు ఫేస్బుక్ ద్వారా ప్రచారం నిర్వహించారు. అయితే, దీనిపై విచారణ చేపట్టిన అధికారులు దృశ్యం సినిమాలోలా హత్యను తప్పించుకునే ప్రయత్నాలు చేసి ఉంటారని భావిస్తున్నారు.