కాంగ్రెస్ 24 గంటల డెడ్ లైన్.. ఆ తరువాత మీ ఇష్టం: లెఫ్ట్ ఫ్రంట్!
కోల్ కత: కొన్ని దశాబ్దాల పాటు వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారానికి పతాక స్థాయికి చేరుకుంది. కమ్యూనిస్టుల ప్రచారాలతో పశ్చిమ బెంగాల్ ఎరుపుమయం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకం అవుతున్నారు. పోలింగ్ గడువు సమీపిస్తుండటంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 38 మంది అభ్యర్థుల జాబితాను లెఫ్ట్ ఫ్రంట్ ప్రకటించింది. మిగిలిన నాలుగు స్థానాలను కాంగ్రెస్ కోసం ఉంచింది.
లెఫ్ట్ పార్టీలు-కాంగ్రెస్ మధ్య ఇంకా పొత్తుల వ్యవహారం కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటిదాకా రెండుసార్లు కొనసాగిన చర్చలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో.. 38 స్థానాలకు లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ తో పొత్తుకు అవకాశాలు ఇంకా ఉన్నాయని లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బోస్ తెలిపారు. మరో 24 గంటల అవకాశాన్ని ఇస్తున్నామని చెప్పారు. అప్పటికీ రాకపోతే.. మిగిలిన నాలుగు స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటిస్తామని బోస్ స్పష్టం చేశారు. మూడు దశల్లో లెఫ్ట్ ఫ్రంట్ 38 మంది అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. సీపీఎం సిట్టింగ్ ఎంపీలు ఉన్న రాయ్ గంజ్, ముర్షీదాబాద్ లల్లో కూడా అభ్యర్థులను నిలిపినట్లు బోస్ తెలిపారు. కాంగ్రెస్ గెలిచిన నాలుగు లోక్ సభ స్థానాల్లో తాము అభ్యర్థులను నిలపట్లేదని, పొత్తు కుదరకపోతే.. అక్కడ పోటీ చేస్తామని అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన బహరామ్ పూర్, జంగీపూర్, ఉత్తర మల్దహా, దక్షిణ మల్దహా నియోజకవర్గాలను కాంగ్రెస్ కోసం కేటాయించినట్లు బోస్ చెప్పారు. తమ రెండు పార్టీలకు ఉమ్మడి శతృవులైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ తమతో పొత్తు పెట్టుకుంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని బోస్ చెబుతున్నారు.
బీజేపీలో మోదీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరు : గడ్కరీ
కాగా, పశ్చిమ బెంగాల్ లోని మొత్తం 42 స్థానాల్లో తాము పోటీ చేస్తామని, ఈ దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సోమేన్ మిత్ర తెలిపారు. కమ్యూనిస్టుల దయాదాక్షిణ్యాలు తమకు అక్కర్లేదని అన్నారు. తాము బలహీనంగా ఉన్నామని లెఫ్ట్ ఫ్రంట్ భావించడంలో అర్థం లేదని అన్నారు.