స్త్రీలు జాకెట్లు చించుకుని లైంగిక దాడి అంటారు: లెఫ్ట్పై టిఎంసి నేత
కోల్కతా: వామపక్ష కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెసు నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మంగళవారంనాడు ఆయన వామపక్ష కార్యకర్తలపై విరుచుకుపడ్డారు.
వామపక్షాల కార్యకర్తల మహిళలపై ఆయన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వామపక్షాల కార్యకర్తలకు చెందిన మహిళలు తమ జాకెట్లను తామే చించుకుని తమపై లైంగిక దాడి జరిగిందని ఆరోపిస్తారని ఆయన అన్నారు. అధికారులు ప్రమోషన్ కోసం తమ పిల్లలనే అరెస్టు చేస్తారని అంటామని, అదే విధంగా సిపిఎంకు చెందిన చాలా మంది నాయకులకు చెందిన మహిళలు తమ జాకెట్లను తామే చించుకుని, తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఇతరులపై నిందలు వేస్తారని ఆయన అన్నారు. ఇంట్లో తమ భర్తలతో గొడవ పడి, దాడికి గురై, తృణమూల్ వారు చేశారని చిత్రిస్తారని ఆయన ఆరోపించారు.
స్వపన్ దేవనాథ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివరణ ఇవ్వాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. తృణమూల్ కాంగ్రెసు ఎంతగా దిగజారిపోయిందో ఆ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ వ్యాఖ్యానించారు. నిందితులను అరెస్టు చేయడానికి బదులు వారిని సమర్థిస్తున్నారని ఆమె అన్నారు. సపన్ దేవనాథ్ తన కార్యకర్తలు, పార్టీకి ఆ విధమైన శిక్షణ ఇస్తున్నారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని బృందా కారత్ ప్రశ్నించారు.
దుస్తులు చించుకుని తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించే స్థాయికి వామపక్షాల కార్యకర్తలు దిగజారుతారని ఆయన అన్నారు. టిఎంసి నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. పలువురు నాయకులు బహిరంగ సభల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేసి దొరికిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.
ప్రతిపక్ష పార్టీల నాయకుల మహిళలపై అత్యాచారం చేయడానికి తమ పిల్లలను పంపిస్తానని వ్యాఖ్యానిస్తూ టిఎంసి నాయకుడు తపస్ పాల్ కెమెరాలకు చిక్కారు. తన ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టడానికి కూడా తాను వెనకాడబోనని ఆయన వ్యాఖ్యానించారు.
తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం టిఎంసి నాయకులకు అలవాటుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రవాణా మంత్రి మదన్ మిత్రా కూడా అటువంటి వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థులను బెదిరిస్తూ బుల్లెట్లు, బాంబులు, పిడిగుద్దుల ద్వారా వారికి తగిన బుద్ధి చెప్తానని ఆయన అన్నారు.