జెఎన్యులో ఏబీవీపీకి ఘోర పరాజయం, లెఫ్ట్ కూటమి గెలుపు
జెఎన్యు (ఢిల్లీ)లో భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిబి)కి ఘోర పరాభవం ఎదురయింది.
న్యూఢిల్లీ: జెఎన్యు (ఢిల్లీ)లో భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిబి)కి ఘోర పరాభవం ఎదురయింది.
ఐక్య వామపక్ష కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి పోటీపడిన గీతా కుమారి, ఎబివిపికి చెందిన నిధి త్రిపాఠిని 464 ఓట్ల తేడాతో ఓడించింది.
ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ ఎబివిపి అభ్యర్థి దుర్గేష్ కుమార్కు 1028 ఓట్లు రాగా, ఏఐఎస్ఏ అభ్యర్థి సిమోన్ జోయా ఖాన్కు 1,876 ఓట్లు వచ్చాయని ఎలక్షన్ ప్యానల్ అధికారులు తెలిపారు.
జనరల్ సెక్రటరీ పోస్టుకు లెఫ్ట్ అభ్యర్థి దుగ్గిరాల శ్రీకృష్ణ పోటీపడి 2,082 ఓట్లు తెచ్చుకున్నాడు. అతనికి సుదూరంగా ఎబివిపి అభ్యర్థి నికుంజ్ మక్వానా 975 ఓట్లతో నిలిచాడు.
జాయింట్ సెక్రటరీ పదవిని కూడా లెఫ్ట్ గెలుచుకుంది. ఈ పదవికి పోటీ పడ్డ శుభాన్షు సింగ్కు 1,755 ఓట్లు వచ్చాయి. సమీప ఎబివిపి అభ్యర్థి పంకజ్ కేసరికి 920 ఓట్లు వచ్చాయి.
ప్రజలకు, విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంకా ఉందని, అందుకే తాము గెలిచామని గీతా కుమారి అన్నారు. తాము ఓడిపోలేదని, పలు గ్రూప్లు కలిసి ఏబీవీపీని ఓడించేందుకు ఏకమయ్యాయని నిధి త్రిపాఠి అన్నారు.