ప్రముఖ సంగీత విద్యాంసుడు ముస్తాఫా ఖాన్ కన్నుమూత: ప్రధాని మోడీ సంతాపం
ముంబై: ప్రముఖ సంగీత విద్యాంసుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్(89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కోడలు నమ్రతా గుప్తాఖాన్ తెలిపారు.
2019లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ముస్తాఫా ఖాన్ ఎడమవైపు భాగం పనిచేయడం లేదు. దీంతో అప్పటి నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత కాసేపటికే మరణించారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనునున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్లో 1931 మార్చి 3న ముస్తాఫా జన్మించారు. ఆయనకు నలుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అందరికంటే ఆయనే పెద్దవారు. తండ్రి ఉస్తాద్ వారిస్ ఖాన్ నుంచి వారసత్వంగా శాస్త్రీయ సంగీతాన్ని అందిపుచ్చుకున్నారు.
సంగీత ప్రపంచానికి ముస్తాఫా ఖాన్ అందించిన సేవలకు గానూ 1991లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. 2006లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి. 2003లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డును అందుకున్నారు. గులామ్ ముస్తాఫా ఖాన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
The passing away of Ustad Ghulam Mustafa Khan Sahab leaves our cultural world poorer. He was a doyen of music, a stalwart of creativity whose works endeared him to people across generations. I have fond memories of interacting with him. Condolences to his family and admirers. pic.twitter.com/jZy7eVhW68
— Narendra Modi (@narendramodi) January 17, 2021
ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ సాహబ్ కన్నుమూయడం మన సాంస్కృతిక ప్రపంచానికి తీరనిలోటు. ఆయన సంగీతానికి ఒక విశిష్టత ఉంది. అతని రచనలు తరతరాలుగా ప్రజలకు నచ్చాయి. ఆయనతో సంభాషించిన జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి. ఆయన కుటుంబానికి, ఆరాధకులకు సంతాపం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.