రిపోర్టర్లకు బీజేపీ రిటర్న్ గిఫ్ట్! కవర్లు..అందులో నోట్లు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికల హడావుడీ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమకు అనుకూలంగా వార్తలు రాయించుకోవడానికి విలేకరులకు గాలం వేసే పార్టీల జాబితాలో భారతీయ జనతాపార్టీ కూడా చేరిపోయింది. విలేకరులను ప్రలోభాలకు గురి చేశారనే ఆరోపణలను ఆ పార్టీ ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బుధవారం జమ్మూకాశ్మీర్లోని మారుమూల ప్రాంతం లడఖ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా వార్తలు రాయాలని, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కోరుతూ కొందరు బీజేపీ నాయకులు స్థానిక విలేకరులను ప్రలోభాలకు గురి చేశారు. వారికి లంచం ఇవ్వజూపారు. దీన్ని లేహ్ ప్రాంత విలేకరులు తప్పు పట్టారు.
రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో లఢఖ్లో పర్యటించబోతున్నారు. లేహ్ సహా భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలను ఆమె సందర్శించబోతున్నారు. సరిహద్దుల్లో కాపలా కాస్తోన్న సైన్యంతో భేటీ కానున్నారు. నిర్మలా సీతారామన్ పర్యటను దృష్టిలో ఉంచుకుని- స్థానిక బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ రంధ్వా, రాష్ట్ర పార్టీ బీజేపీ నాయకుడు రవీందర్ రైనా విలేకరులను ప్రలోభానికి గురి చేయాలని నిర్ణయించుకున్నారు. హోటల్ సింగే ప్యాలెస్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని లేహ్ ప్రెస్క్లబ్లో తెలియజేశారు. దీనితో పలువురు విలేకరులు ఆ ప్రెస్మీట్కు హాజరయ్యారు.
సమావేశం ముగిసిన అనంతరం- రంధ్వా, రవీందర్ రైనా కొందరు విలేకరులకు కవర్లను అందజేశారు. అందులో 500 రూపాయల నోట్లను ఉంచారు. నిర్మలా సీతారామన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అయి ఉండొచ్చనే ఉద్దేశంతో కవర్లను తెరిచి చూసిన విలేకరులు ఆశ్చర్యపోయారు. అందులో 500 రూపాయల నోట్లను ఉంచిన విషయాన్ని వారు రంధ్వా, రైనా దృష్టికి తీసుకెళ్లారు. తమను ప్రలోభానికి గురి చేయడం సరికాదని అన్నారు. బీజేపీ నాయకుల చర్య తమను షాక్కు గురి చేసిందని, ఇలా చేయడం తప్పని చెప్పామని అన్నారు. ఈ చర్యను వారు సమర్థించుకున్నారని అన్నారు. తాము అభిమానంతో ఇస్తున్నామని, ఇదంతా సాధారణమేనని తమను ఒప్పించే ప్రయత్నం చేశారని రించెన్ యాంగ్మో చెప్పారు. ఇలాంటివి ప్రతి చోటా ఉంటాయని కవర్లను తీసుకోవడానికి బలవంత పెట్టారని ఆమె స్పష్టం చేశారు.
కవర్లు కావు.. ఆహ్వాన పత్రాలు
లేహ్ విలేకరుల ఆరోపణలపై స్థానిక బీజేపీ సీనియర్ నాయకుడొకరు తోసి పుచ్చారు. ఆ కవర్లలో ఉన్నవి నోట్లు కావని, నిర్మలా సీతారామన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, ఆహ్వాన పత్రాలు ఉన్నాయని అన్నారు. విలేకరులను తాము గౌరవిస్తామని తమ పార్టీ ఇలాంటి పనులకు దూరంగా ఉంటుందని అన్నారు.