రోజంతా నిమ్మకాయతో సీఎం సిద్ధూ: జ్యోతిష్కుల సూచనా?
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో గడియారం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత కారుపై కాకి వాలడంతో మార్చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిమ్మకాయ విషయంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఆయన తన స్వస్థలం మైసూరులో చేతిలో నిమ్మకాయతో కనిపించారు.
ఆయన తన చేతిలో నిమ్మకాయ పట్టుకొని కనిపించడంతో మీడియా దానిని హైలెట్ చేసింది. దీంతో ఆయన దానిని ఎందుకు పట్టుకున్నారనే చర్చ సాగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను, క్లిప్పింగ్స్ను ఛానల్స్ ప్రసారం చేశాయి.
ఆయన మైసూర్ పర్యటనలో రోజంతా నిమ్మకాయ చేతిలో పట్టుకొని కనిపించారు. నిమ్మకాయ విషయపై ఆయన స్పందించలేదు. దుష్టశక్తులను ఎదుర్కోవడానికి ఏ మతపెద్దలో సిద్ధరామయ్యకు నిమ్మకాయ ఇచ్చి ఉంటారని కొంతమంది, కొంత మీడియా పేర్కొంది.
ఇటీవల సిద్ధరామయ్య కుమారుడు రాకేశ్ మృతి చెందడంతో ఆయనలో మార్పు వచ్చిందని అంటున్నారు. ఏదో దుష్టశక్తి తన కుటుంబానికి హాని చేస్తోందని ఆయన భావిస్తున్నారని, మిగతా కుటుంబ సభ్యుల భద్రత గురించి బెంగ కారణంగా జ్యోతిష్కులు ప్రత్యేక పూజలు చేయాలని ఆయనకు సూచించారని ఓ ఎమ్మెల్యే చెప్పారు.