బెంగాల్లో దారుణం: తల్లి చూస్తుండగా మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుతపులి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. అలీవూర్దవార్ జిల్లాలోని లేబర్ లైన్లో మంగళవారం రాత్రి ఓ చిరుతపులి ఓ ఇంట్లోకి ప్రవేశించి, తల్లి దగ్గర ఉన్న చిన్నారిని లాక్కెళ్లింది. ఆ చిన్నారి మృతదేహం భాగాలు మూడు కిలో మీటర్ల దూరంలో కనిపించాయి. ఈ ప్రాంతం కోల్కతాకు 683 కిలో మీటర్ల దూరంలో ఉంది.
మూడేళ్ల చిన్నారిని నోటకరిచి ఎత్తుకెళ్లిన చిరుతపులి
గత ఏడాది (2018) డిసెంబర్ నుంచి చిరుతపులి ధాటికి ఇక్కడ చనిపోయిన మూడో చిన్నారి ఈమె. లేబర్ లైన్లో ఉంటున్న పూజ ఓరాన్ మంగళవారం నాడు తన మూడేళ్ల కూతురు ప్రణీతను తన దగ్గర ఉంచుకొని వంట వండుతోంది. ఆ సమయంలో ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. ఇంటి లోపలికి వచ్చిన చిరుతపులి వీరిపై దాడి చేసింది. పూజ దగ్గర ఉన్న చిన్నారిని నోట కరుచుకుని వెళ్లింది. కూతురును రక్షించుకునేందుకు పూజ కాపాడుకునేందుకు పూజ ప్రయత్నించింది.
మూడు కిలో మీటర్ల దూరంలో చిన్నారి శరీర భాగాలు
పూజ అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని చిన్నారి కోసం గాలించారు. కానీ కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం మదరిహత్లోని ఓ తేయాకు తోటలో చిన్నారి శరీర భాగాలను పోలీసులు గుర్తించారు. పూజ ఓరాన్ అక్కడే ఉన్న టీ ఎస్టేట్లో లేబర్గా పని చేస్తున్నారు. ఆ సమయంలో చిరుతపులి వారి ఇంటిలోని కంచెను దాటి లోపలకు వచ్చింది.
పూజ వంట చేస్తుండగా
పూజ తన ఇంటి ఆవరణలో వంట చేస్తోందని, ఆ సమయంలో చిన్నారి ప్రణీత ఆమె వద్దే ఉందని, అప్పుడే చిరుతపులి వచ్చి చిన్నారిని నోటక రచి లాక్కెళ్లిందని, దీంతో పూజ ఆ చిరుతపులి వెంట పడిందని, అరిచిందని, పక్కనే ఉన్న వారు వచ్చారని, కానీ ఫలితం లేకుండా పోయిందని ఓ లోకల్ స్కూల్ టీచర్ చెప్పారు.
ఉద్యోగం హామీ
చిన్నారి బాడీ మూడు కిలో మీటర్ల దూరంలో దొరికింది. ఆ పాప తల శరీరం నుంచి వేరు అయింది. స్థానికులు టీ ఎస్టేట్ వద్ద ఆందోళనకు దిగారు. గత నెల రోజులుగా ముగ్గురు చనిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పూజా ఓరాన్కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులు ఆందోళన చేస్తున్న వారికి హామీ ఇచ్చారు. గత ఏడాది (2018) డిసెంబర్ నెలలో ఆరేళ్ల, పన్నెండేళ్ల పిల్లలను కూడా చిరుత ఎత్తుకెళ్లింది. వీరు రామ్ఝోరా, ధుంచిపారాలకు చెందిన వారు. వీరు కూడా అలీపూర్దువార్ జిల్లాలోని టీ ఎస్టేట్స్లోనే పని చేస్తున్న కుటుంబాలకు చెందినవారు.