ఈ రూటులో ప్రయాణికులే లేరు..అందుకే రైలు సర్వీసు నిలిపేస్తున్నాం : రైల్వేశాఖ
ఈ రైలు అత్యంత తక్కువ కిలోమీటర్లు నడుస్తుంది. ఇది ఎన్ని కిలోమీటర్లు పరుగులు తీస్తుందో తెలుసా కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే. అంతేకాదు ఇందులో కేవలం మూడు కోచ్లు మాత్రమే ఉంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది భారతదేశంలోనే అత్యంత పొట్టి రైలు. ఇంతకీ ఈ రైలు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పరుగులు తీస్తుందనేగా మీ డౌటు... అయితే చూడండి.
9 కిలోమీటర్లను కవర్ చేసేందుకు 50 నిమిషాలు
ఈ ఫోటోలో కనిపిస్తున్న రైలు కొచ్చిన్ హార్బర్ టర్మినస్ నుంచి ఎర్నాకుళం జంక్షన్ వరకు నడుస్తుంది. మొత్తం 9 కిలోమీటర్లను కవర్ చేసేందుకు 50 నిమిషాల సమయం ఈ రైలు తీసుకుంటుంది. ఇది మూడు కోచ్లున్న డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్. అంటే డెమూ రైలు అన్నమాట. ఈ రైలు ప్రాంరభమై ఒక వారం అయ్యింది. అయితే అప్పుడే ఈ సర్వీసును నిలిపివేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇంతకీ ఈ రైలుతో ఇబ్బందా... లేక ఇతరత్రా కారణం ఏదైనా ఉందా..?
పట్టుమని 10 టికెట్లు అమ్ముడుపోవు
వారం రోజుల క్రితమే ప్రారంభమైన ఈ రైలు సర్వీసును అప్పుడే నిలిపివేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు కారణం ఈ రైలులో పట్టుమని 10 మంది ప్రయాణికులు కూడా ఉండరట. దీంతో ఈ రైలు నడపడం వల్ల నష్టమే తప్ప ఒరిగేదేమీ లేదనే ఆలోచనకు అధికారులు వచ్చేశారట. రోజుకు 10 టికెట్లు అంతకంటే తక్కువగా అమ్ముడుపోతున్నాయని తిరువనంతపురం డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్.కే. సిన్హా అన్నారు.
ఈ రూటులో ప్రైవేట్ బస్సులు ఎక్కువ
ఒక వారం నుంచి ఈ రైలు నడుస్తోందని అయితే ఇప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మేనేజర్. ఒకరోజు మాత్రం ఇద్దరు ప్రయాణికులే రైలు ఎక్కారు. అంతకన్నా ముందు రోజు నలుగురు ప్రయాణికులు ఎక్కారు. ఇక ఇలా అయితే నష్టాలు తప్ప లాభాల బాట పట్టేదెప్పుడని ఆయన ప్రశ్నించారు. ఈ రూట్లో కావాల్సినన్ని ప్రైవేట్ బస్సులు తిరుగుతుంటాయని అలాంటప్పుడు రైలు వేయడం తనను నిజంగా ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు ఓ టెక్నీషియన్. కానీ ఈ నిర్ణయాలన్నీ అధికారులే చేస్తారని ఆయన చెప్పారు. అయితే భవిష్యత్తులో ఈ రైలు గతి ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు.
రైలు సర్వీసును నిలిపివేయకుండా కొట్టాయం వరకు పొడగించాలి
కొందరికి మాత్రం ఈ రైలు చాలా అద్భుతంగా ఉంది. ఆ రైలులో ప్రయాణంచడం చాలా బాగుందంటున్నారు. కొచ్చిన్ హార్బర్ టర్మినస్కు ఆటోలో వెళ్లాలంటే రూ.120 అవుతున్నాయని అదే ఈ రైలులో చాలా కంఫర్టబుల్గా వెళ్లొచ్చని అది కూడా తక్కువ ధరతోనే అని జోసెఫ్ అనే ప్రయాణికుడు చెప్పారు. ఈ చిన్న రూట్లో రైలు నడపడం కష్టమే అయినప్పటికీ... ఈ రైలు సర్వీసును త్రిసూర్ లేదా కొట్టాయం వరకు పొడగిస్తే అప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నాడు జోసెఫ్. అంతే తప్ప సర్వీసును మాత్రం నిలపకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.