ప్రభుత్వ జోక్యంపై దీపక్ మిశ్రాకు చలమేశ్వర్ లేఖ
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల విషయంలో ప్రభుత్వ జోక్యంపై చర్చించడానికి పూర్తి కోర్టును సమావేశపరచాలనిసుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాన న్యాయమూర్తికి గతవారం లేఖ రాశారు.
జాస్తి చలమేశ్వర్ లేఖపై ప్రధాన న్యాయమూర్తి ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ప్రధాన న్యాయమూర్తికి రాసిన ఐదు పేజీల లేఖ ప్రతులను ఆయన 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా పంపించారు.
ఆ లేఖపై జాస్తి చలమేశ్వర్ర మార్చి 21వ తేదీన సంతకం చేశారు. హైకోర్టుల్లో న్యాయమూర్తులను నియమించే విషయంలో సుప్రీంకోర్టు కొలీజయం చేసిన సిఫార్సులను ఆమోదించడంలో సెలెక్టివ్గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తమకు అసౌకర్యం కలిగిస్తారని భావించే పేర్లను విస్మరిస్తోందని, దానివల్ల న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిపై ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.
న్యాయవ్యవస్థ పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన అత్యత ప్రదానమైన విషయంపై ప్రదాన న్యాయమూర్తి సాధారణంగా పూర్తి కోర్టును సమావేశపరుస్తారు. తన అభిశంసనకు రాజ్యసభలో ప్రతిపక్షాలు సంతకాల సేకరణ జరుపుతున్న సమయంలో పూర్తి కోర్టును సమావేశపరచాలనే చలమేశ్వర్ లేఖ ప్రధాన న్యాయమూర్తని మరింత ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉందన అంటున్నారు.