అన్నదాతలకు కేంద్రం మరో షాక్- ఇక పరిశ్రమలే నేరుగా రైతుల భూములు కొనే ప్రతిపాదన
దేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలో "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమంలో భాగంగా దేశంలో కరోనా కారణంగా కుదేలైన తయారీ పరిశ్రమను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం ఓ మంత్రుల బృందాన్ని కూడా నియమించింది. దీనికి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందం తాజాగా రాష్ట్రాలకు చేసిన ప్రతిపాదన షాకింగ్గా కనిపిస్తోంది.
కేంద్రం మంత్రుల బృందం తాజా ప్రతిపాదన ప్రకారం దేశంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ఆయా సంస్ధలే రైతుల నుంచి నేరుగా భూములు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించమని కోరుతున్నారు. ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలో అయినా పరిశ్రమ పెట్టాలంటే స్ధానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు భూమిని సేకరించి పరిశ్రమలకు ఇస్తున్నాయి. లేదా ప్రభుత్వ భూములను మార్కెట్ ధరల ప్రకారం పలు రాయితీలతో కేటాయిస్తున్నాయి. కేంద్రం తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే పారిశ్రామిక వేత్తలే నేరుగా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
పైకి చూడటానికి బాగానే ఉన్నా ఇందులో రైతుల భూముల్ని పారిశ్రామిక వేత్తలు సజావుగా మార్కెట్ ధర ప్రకారం తీసుకుంటారా అంటే గ్యారంటీ లేదు. దీంతో అంతిమంగా రైతులకే నష్టం జరగబోతోందన్న భయాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పరిశ్రమలకు భూములు కేటాయించాలంటే సుదీర్ఘ ప్రక్రియ ఉంది. 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వాల వద్ద అంత డబ్బు లేదు. దీంతో నేరుగా పారిశ్రామిక వేత్తలకే కొనుక్కునే అవకాశమిస్తే ఏ పరిహారం చెల్లించకుండా నేరుగా రేట్లు మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ ప్రక్రియలో ఆలస్యాన్ని నివారించవచ్చని కేంద్రం చెబుతోంది. కానీ భూసేకరణ చట్టాన్ని బైపాస్ చేసి ఇలా నేరుగా రైతుల భూములు పరిశ్రమలకు కట్టబెట్టేందుకు రాష్ట్రాలు అంగీకరిస్తాయా అన్నది ఇప్పుడు సవాలుగా మారింది. రాష్ట్రాల అభిప్రాయాల ఆధారంగా మంత్రుల బృందం ప్రతిపాదనపై కేంద్రం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది.