ప్రియాంకపై రాహుల్ చాడీలు... ! చెల్లి నాకన్నా పెద్ద హెలికాప్టర్ లో తిరుగుతోంది ( వీడియో )
లక్నో: మూడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరిరోజు శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్ వారిద్దరిదీ. వేర్వేరు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొనడానికి హడావుడిగా హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు ఆ అన్నాచెల్లి. ఒకరి భుజాలపై ఒకరు చెయ్యి వేసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. వచ్చినంత వేగంగా వెళ్లిపోయారు, వారే- కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా. శనివారం ఉదయం వారిద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లడానికి ముందు- హెలిప్యాడ్ లో కలుసుకున్నారు. కొద్దిసేపు మట్లాడుకున్నారు. పైలెట్లతో గ్రూప్ ఫొటో దిగారు.
మంచి అన్న అంటే ఎలా ఉండాలో తెలుసా?
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మంచి అన్న ఎలా ఉండాలో తెలుసా?. ఎక్కువ దూరం, ఎక్కువ రాష్ట్రాలు తిరగాల్సిన నేను చిన్న హెలికాప్టర్ ను వాడుతున్నా. తక్కువ దూరం, ఒకే రాష్ట్రంలో ప్రచారం చేస్తోన్న నా చెల్లెలు, పే..ద్ద హెలికాప్టర్ ను వాడుతోంది. ఆమె కోసం నేను పెద్ద హెలికాప్టర్ ను త్యాగం చేశా.. అని చెప్పుకొచ్చారు. అనంతరం పరస్పరం అభినందలు తెలుపుకొని వెళ్లిపోయారు. వెళ్తూ, వెళ్తూ పైలెట్లతో గ్రూప్ ఫొటో దిగారు. దీనికి సంబధించిన వీడియో ఒకటి సోెషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మూడో విడత పోలింగ్ కు ముగిసిన ప్రచారం..
మూడో విడత ఎన్నికల పోలింగ్ సోమవారం ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రచారం.. శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఎన్నికల హడావుడిలో ఉన్న నాయకులందరూ సాయంత్రానికి తమ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టారు. పార్టీ కార్యాలయాలకు చేరుకున్నారు. మూడో విడతలో మొత్తం తొమ్మిది రాష్ట్రాలు, 71 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. దీనికోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగిలిన చోట్ల 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.