పాక్ కూడా సీఏఏ ఆమోదిస్తే..: ముస్లింలు వెళ్లొచ్చంటూ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ పాకిస్థాన్ దేశం అక్కడ సీఏఏను ఆమోదిస్తే.. ముస్లిం మైనార్టీలంతా అక్కడికి పోవచ్చని అన్నారు. సీఏఏ ఎవరి పౌరసత్వం తొలగించదని, ఇది పౌరసత్వ ఇచ్చే చట్టమని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెబుతుంటే ఈ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అక్కడి ముస్లింలు వెళ్లొచ్చు..
ముజఫర్నగర్లోని కథౌలి ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ మాట్లాడుతూ.. కొత్త పౌరసత్వం చట్టం ద్వారా తాను ఒక కొత్త పరిష్కార మార్గాన్ని కనుగొన్నట్లు తెలిపారు. ‘సీఏఏ అనేది హిందువులకు అవసరమైన చట్టం. పాకిస్థాన్ కూడా ముస్లిం కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలి. పాకిస్థాన్ నుంచి వచ్చే మైనార్టీలను ఇండియా స్వాగతిస్తుంది.. అదే సమయంలో పాక్ చేసే ఇలాంటి కొత్త చట్టంతో అక్కడి ముస్లింలంతా వెళతారు' అని సైనీ వ్యాఖ్యానించారు.
హిందువుల ఇటు.. ముస్లింలు అటు..
ఇండియా, పాకిస్థాన్లు ఇరు దేశాల్లోని బాధితులైన హిందువులు, ముస్లింలను మార్చుకోవాలని అన్నారు. సీఏఏను వ్యతిరేకిస్తున్నవారు ఇండియా లాంటి చట్టాన్ని పాకిస్థాన్ చేస్తే ఎవరు ఆపుతున్నారో ప్రశ్నించాలని, అలాంటి చట్టం తెస్తే అక్కడి హిందువులు ఇటు.. ఇక్కడి ముస్లింలు అటు వెళతారని.. దీంతో 100శాతం సమస్య పరిష్కారమవుతుందని అన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో..
శనివారం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా సదరు ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ ఈ మేరకు స్పందించారు. కాగా, ఇతడు 2013లో అల్లర్ల కేసులో నిందితుడిగా ఉండటం గమనార్హం. సైనీతోపాటు సంజీవ్ బల్యానీ అనే మరో బీజేపీ నేత కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే, తమపై గత సమాజ్ వాదీ ప్రభుత్వం అక్రమంగా ఈ కేసుల్లో ఇరికించిందని సైనీ ఆరోపించారు. గతంలో కూడా సైనీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి సమయంలో ఉత్తరప్రదేశ్ యువకులు జమ్మూకాశ్మీర్లోని అందమైన యువతులను పెళ్లి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. 8వ తరగతి వరకు మాత్రమే చదివిని ఈయనపై పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.
ఆ దేశాల ముస్లింలకు పౌరసత్వ ఇవ్వరు..
కాగా, ఆదివారం సీఏఏకు మద్దతుగా బీజేపీ ముజఫర్నగర్లో భారీ ర్యాలీ నిర్వహించింది. సీఏఏపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్యప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు నేతలు పిలుపునిచ్చారు. బీజేపీ నేత సంజీవ్ బాల్యన్ ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. కొత్తగా తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. భారతదేశంలోని ముస్లింలు భారతీయ పౌరులుగానే ఉంటారు. కానీ, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలకు ఈ చట్టం ద్వారా పౌరసత్వ ఇవ్వబడదని స్పష్టం చేశారు. వారంతా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు వస్తున్నారని అన్నారు.