సాధ్వి క్షమాపణలను అంగీకరించి.. సభ నిర్వహణకు సహకరించండి: లోక్సభలో ప్రధాని
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాలా సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ లోక్సభలో వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో అలాంటి భాషను ఉపయెగించవద్దని తాను మంత్రులతో చెప్పానని అన్నారు.
ఎవరూ అలాంటి భాషను ఆమోదించరన్న మోడీ, ఆమె చేసిన పొరబాటుకు క్షమాపణలు కోరారని చెప్పారు. తను కొత్త ఎంపీ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారని, ఈ క్రమంలో సాధ్వి క్షమాపణలను అంగీకరించాలని ప్రధాని సభను కోరారు. క్షమాపణలు కోరిన దృష్ట్యా వివాదం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ సాధ్వి ఉభయసభలకు క్షమాపణ చెప్పిన నేపథ్యంలో... సభ నిర్వహణకు సహకరించాలని కోరారు. దీంతో లోక్ సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ సాధ్వీపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టగానే... విపక్షాలు ఆందోళనకు దిగాయి. నేటి సభా సమావేశాలు ప్రారంభం కాగానే ఆందోళనకు దిగిన విపక్ష సభ్యులు సాధ్వి రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు.
గురువారం రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రకటన చేసినా... సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ సభను మధ్యాహ్నాం 12 గంటల వరకు వాయిదా వేశారు.
సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలి: వెంకయ్య
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సాధ్వీ వ్యాఖ్యలపై ప్రధాని ప్రకటన చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనేక ప్రజా సమస్యలను సభలో చర్చించాల్సి ఉందన్నారు.