Kerala Air Crash:ఆ నివేదిక వచ్చేవరకు ప్రమాదంపై ఎలాంటి వార్తలు నమ్మరాదు
కోజికోడ్: కోజికోడ్ విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చే వరకు అసత్య ప్రచారాలను నమ్మరాదని చెప్పారు కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ.విమానం ప్రమాదంకు ముందు ఏం జరిగింది.. ప్రమాదం తర్వాత ఏం జరిగింది అనే అంశాన్ని ఇప్పుడప్పుడే చెప్పలేమని నివేదిక వచ్చాకే ఏదైనా స్పష్టంగా చెప్పగలమని అన్నారు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. డీజీసీఏ ఇచ్చే దర్యాప్తు నివేదిక కోసం అంతా వేచిచూడాలని చెప్పారు. ఇదిలా ఉంటే విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.
కోజికోడ్ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ. తీవ్ర గాయాలపాలైనవారికి రూ. 2లక్షలు స్వల్పంగా గాయాలైనవారికి రూ.50వేలను పరిహారం ప్రకటించారు మంత్రి. కోజికోడ్ విమాన ప్రమాదం ఘటనా స్థలానికి శనివారం ఉదయం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వచ్చారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందుగా సహాయక చర్యలు చేపట్టాలని ఆ తర్వాత వైద్యం అందేలా దృష్టి సారించాలని ఆపై బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత డీజీసీఏతో దర్యాప్తు చేయించాలని అన్నారు. ఇప్పుడివన్నీ జరుగుతున్నాయని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.
కోజికోడ్ విమానాశ్రయంలోని టేబుల్ టాప్ రన్వేపై జరిగిన విమాన ప్రమాద ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించిందని మంత్రి అన్నారు. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం 18 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దగ్గరగా సమీక్షిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పిన పూరీ... నివేదిక వచ్చేవరకు ఎలాంటి వార్తలకు తావివ్వరాదని చెప్పారు. ఒక్కసారి బ్లాక్ బాక్స్లోని అంశాలు బయటకు వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రమాదం కారణంగా వందేభారత్ మిషన్కు బ్రేక్ పడదని స్పష్టం చేశారు మంత్రి. ఇది యాథాతథంగా కొనసాగుతుందని వెల్లడించారు.
Kerala: Civil Aviation Minister, Hardeep Singh Puri visits Kozhikode Airport, where an #AirIndiaExpress flight crashlanded yesterday.
— ANI (@ANI) August 8, 2020
18 people, including two pilots, lost their lives in the incident. pic.twitter.com/RW2FQnAxNv
Recommended Video
ఇదిలా ఉంటే మానవతప్పిదమే ప్రమాదానికి కారణమా అని అడిగినప్పుడు అన్ని విషయాలు నివేదిక వచ్చాక తెలుస్తాయని చెప్పారు. దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా టేబుల్ టాప్ రన్వేలు ఉన్నాయని... అయితే ఈ రన్వేలతో ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ పైలట్ అనుభవంను దృష్టిలో ఉంచుకుని ల్యాండింగ్కు క్లియరెన్స్లు ఇవ్వడం జరగుతుందని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.