మీడియా ముందుకు ఉగ్రవాది: పాక్ వక్రబుద్ధి బట్టబయలు
శ్రీనగర్: జూలై 25వ తేదీన జమ్ము కాశ్మీర్లో పట్టుబడ్డ ఉగ్రవాది బహుదూర్ అలీని ఎన్ఐఏ అధికారులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు సంబంధించిన కీలక ఆధారాలను, పాకిస్థాన్ కుటిల బుద్ధిని మీడియా ముందు బహిర్గతం చేశారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో లష్కరే తోయిబా క్యాంపులు నిర్వహిస్తోందని అధికారులు అన్నారు. ప్రతి క్యాంపులో ముప్పై నుంచి యాభై మంది సభ్యులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ క్యాంపుల్లో ఉగ్రవాదులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసి, ప్రణాళికాబద్ధంగా శిక్షణ ఇస్తోందన్నారు.
కాశ్మీర్లోని పరిస్థితులను అవకాశంగా మలుచుకోవాలని లష్కరే తోయిబా భావిస్తోందన్నారు. బహుదూర్ అలీ వంటి ఉగ్రవాదులను సరిహద్దులు దాటించిందన్నారు. ఇలాంటి వారు చాలామంది సరిహద్దుల అవతల అవకాశం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
బహదూర్ అలీ విచారణలో అవాక్కయ్యే విషయాలు వెల్లడించాడు. భారత్లో తాను ఏం చేయాలో ఎప్పటికప్పుడు పాక్ నుంచి ఆదేశాలు అందేవని చెప్పాడు. పాకిస్తాన్లో తనలా శిక్షణ పొందుతున్న వారు వందలమంది ఉన్నారని చెప్పాడు. భారతీయులంటే తనకు అసహ్యమని, వారిని చంపేందుకే భారత్ వచ్చానని అతను చెప్పాడు.