అర్ధరాత్రయినా బలపరీక్ష నిర్వహించాల్సిందే: యడ్డీ! అంత ఆతృమెందుకు?: కుమార
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప నిప్పులు చెరిగారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం సభ పునఃప్రారంభమైన సమయంలో ప్రసంగించారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రయినప్పటికీ బలపరీక్షను నిర్వహించి తీరాల్సిందేనంటూ పట్టుపట్టారు. అర్ధరాత్రి 12 గంటలైనప్పటికీ.. సభ కొనసాగి తీరాల్సిందేనని, బలపరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.
బలపరీక్షలో గవర్నర్ జోక్యంపై కాంగ్రెస్ ఫైర్!
అధికార కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు అనవసర విషయాలతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసందర్భ అంశాలను సభలో ప్రస్తావిస్తున్నారని, సభను వాయిదా వేయించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన ఆరోపణలు, విమర్శలను ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తిప్పి కొట్టారు. బలపరీక్షా సమయాన్ని నిర్దేశించడానికి ప్రతిపక్ష నేతకు హక్కు లేదని మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సభ ప్రారంభమైన సమయంలో యడ్యూరప్ప మాట్లాడారు. బలపరీక్ష నిర్వహణపై గవర్నర్ వజూభాయ్ వాలా పంపిన ఆదేశాలను ఆయన సభలో చదివి వినిపించారు. గురువారం రాత్రి నాటికి గురువారం రాత్రి నాటికి బలపరీక్షను నిర్వహించాలని స్పీకర్ రమేష్కుమార్ను ఉద్దేశించి పంపించిన సందేశాన్ని ఆయన చదివి వినిపించారు.
దీనిపై- ముఖ్యమంత్రి కుమారస్వామి విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతకు ఎందుకింత ఆతృత అంటూ ఎద్దేవా చేశారు. రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాలని తాపత్రయ పడుతున్నారని ధ్వజమెత్తారు. శాసనసభా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం తగదని అన్నారు. దీనివల్ల సరికొత్త సంప్రదాయానికి తెరతీసినట్టువుతుందని ఆరోపించారు. శాసనసభ వరకు- స్పీకర్ తీసుకునే నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రూల్ బుక్ను చదివి వినిపించారు.